వీలుంటే నా నాలుగు లంకెలు ...

27, ఆగస్టు 2009, గురువారం

ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) విషయంపై నాకు లీగల్ నోటీస్

12 వ్యాఖ్యలు
లోగడ, ప్రస్తుత ఎలక్ట్రాని క్ వోటింగ్ మిషన్ (EVM) పనితీరు మెరుగు పరచాలని, లొసుగులు లేకుండా చెయ్యలని, సుప్రీం కోర్టులో ప్రజావాజ్యం(Public Interest Litigation) వేసియున్నాను. సుప్రీం కోర్టు మా పరిదికాదు, ఎలక్షన్ కమీషన్ వారిని సంప్రదించండి అని కేసును కొట్టివేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా, కేంద్ర ఎలక్షన్ కమీషన్ సెంప్టెంబర్ ౩, 2009 న వారి ఆఫీసికి (EVM) పై చర్చించుటకు ఆహ్వానించింది.
విచిత్రమేమిటంటె, ఇసీఐల్ వారు నాకు లీగల్ నోటీసు పంపించారు. వారి ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) వ్యాపారము నా చర్య వల్ల దెబ్బతింటుందట! ఆంటే, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు వారి దృష్ఠిలో వ్యాపారము అన్నమాట.

9, ఆగస్టు 2009, ఆదివారం

పురాణగ్రంథాలు కథలైతే రామసేతు మాటేమిటి?

11 వ్యాఖ్యలు
పురాణ గ్రంథాలన్నీ కథలేనని, వాస్తవ చరిత్రలు కావని నాస్తికులు, హేతువాదులు అంటున్నారు. మరి భారత భూభాగానికి, శ్రీలంకకు మధ్య ఉన్న రామసేతు మాటేమిటి? ఆ ఆనకట్టలోని రాళ్లు నీటిపైన తేలాడుతున్నాయి. దీనికి వారేమంటారు?
- ఓ బ్లాగరి ప్రశ్న.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య గారి సమాధానం...
ప్రజల విశ్వాసాలను మనమందరం గౌరవించాలి. వారి వారి ఆలోచనా ధోరణుల్ని వారి విచక్షణకు వదిలేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రథమధర్మం. అలాగే ఒకరి విశ్వాసాలు మరొకరి విశ్వాసాలకన్నా గొప్పవని అనుకోవడం కూడా సబబు కాదు. మతప్రసక్తి లేని లౌకికరాజ్యం మనది. అయితే వ్యక్తులు తమ నమ్మకాలను, విశ్వాసాలను వాస్తవాలుగా ప్రచారం చేసుకోవాలంటే వారు ఋజువులు చూపడానికి కూడా సిద్ధపడాలి. 'నేను మహా గొప్పవాణ్ణి' అని నేననుకున్నంతవరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ 'నేనే మహా గొప్పవాణ్ణి' అని వీధుల్లోకి వచ్చి కనిపించినవారికల్లా బడాయిపోతున్నారనుకోండి. అప్పుడు ఆసక్తి కలిగిన అమ్మాయో.. అబ్బాయో.. పెద్దో.. చిన్నో.. ఎవరైనా 'నీ గొప్పతనమేంటో ప్రదర్శించు చూద్దాం' అని అడిగే హక్కు ఉంటుంది. అలాగే ఆ గొప్పతనం ఏమిటో ప్రదర్శించాల్సిన బాధ్యత కూడా నామీద ఉంటుంది. భారత, రామాయణం, ఖురాన్‌, బైబిల్‌ వంటి గ్రంథాలు చాలా గొప్పవి. అవి చదువుతుంటే ఎంతో ఆసక్తి, సంభ్రమం కలుగుతాయి. అద్భుత కావ్యాలుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే అవి వేలాది సంవత్సరాలుగా ప్రజల జీవనవిధానాల్లో ఇమిడిపోయాయి. కళా దృక్పథం, వాంఙ్మయ సామర్థ్యం ఉన్న మహనీయులు ఎందరో ఈ గ్రంథాలను మరింత పరిపుష్టి చేశారు. పురాణగ్రంథాల్లో ఉన్న ప్రముఖవ్యక్తులు ఇక్కడ అదృశ్యమై అక్కడ ప్రత్యక్షమవుతారనీ, ఇంకా మరేవో మహత్తులు వారికి ఉన్నాయని ఆయా గ్రంథాల పాఠకులు వారిలో వారే అనుకుంటే అది వారి ఇష్టం. కానీ వారు సమాజం మధ్యలోకి వచ్చి ఇలాంటి కల్పనలు వాస్తవాలని వాదిస్తే.. 'అలా ఏ వ్యక్తీ అదృశ్యమై తిరిగి ప్రత్యక్షమైన దాఖలాలు ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయలేరని' వాదించే హక్కు ఇతరులకు ఉంటుంది. 'కేవలం వినడం వరకే నీ పని, ప్రశ్నించే హక్కు నీకు లేదు' అని ఎవరైనా అంటే అది న్యాయం కాదు. చిటికెన వేలితో పెద్ద పర్వతాన్ని నిలబెట్టగల శక్తివంతుడు, అరచేతిలోంచి అదే పనిగా తానులకొద్దీ చీరలను కుళాయిలో నీళ్లులాగా తీసుకురాగల మహిమాన్వితుడు మానవ చరిత్రలో ఎక్కడా లేడు. మానవుడు ఈ భూమ్మీద పుట్టి ఇప్పటికి సుమారు 20 లక్షల సంవత్సరాలైనా రాత ప్రతుల ద్వారా సమాచారాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందజేసే సంఙ్మాయుత (coded communication) వ్యవస్థకు పదివేల సంవత్సరాలకు మించిన చరిత్ర లేదు. మానవులు సమూహాలుగా ఏర్పడి పాలకులు, పాలితులుగా మారిన రాజ్యవ్యవస్థ ఏర్పడి లక్ష సంవత్సరాలు కూడా కాలేదు. అంతకన్నా ముందు ఈ భూమిపై మానవులు సంచరించిన పద్ధతులు, ఆహారపు సేకరణ విధానాలు, కుటుంబవ్యవస్థ, ఉత్పత్తి సంబంధాలు, కళలు వంటి విషయాలు (నాగరికత) పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిని ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఆధారంగా రూపురేఖలు, వయస్సును తెలుసుకోగలుగుతున్నాం. ఆరీత్యా చూస్తే మానవసమాజంలో యుగాలు ఉన్నట్లు, ఒక్కో యుగంలో ఎవరో అవతార పురుషుడు వచ్చి సమస్త ప్రపంచాన్ని అద్భుత మహత్తులతో పాలించినట్లు ఎటువంటి ఆధారాలూ లేవు. రామాయణంలోని వ్యక్తులు, భారతంలోని వ్యక్తులు, భాగవతంలోని పాత్రలూ, బైబిల్‌, ఖురాన్‌ వంటి మతగ్రంథాల్లో ఉటంకించిన వ్యక్తులూ చరిత్రలో ఏమాత్రం లేరని మనం చెప్పలేము. ఆయా కాలాల్లో గొప్ప సమర్థులైన వీరులు, అందమైన స్త్రీలు, క్రూర బుద్ధులు ఉన్న మనుషులు ఇప్పటిలానే అప్పుడూ ఉండేవారు. మంచి, చెడుల మధ్య పోరాటం ఆయా కాల మాన పరిస్థితులు నిర్ధారించిన ధర్మాధర్మాల మధ్య ఘర్షణ, భూమి, నీరు, నివాసం వంటి ప్రకృతి వనరుల కోసం యుద్ధాలు జరిగాయి. సమాజంలో ఉన్న చెడును గుర్తించి దాన్ని నివారించడానికి ఉపదేశాలను చేసిన వారు కూడా ఉండేవారు. అటువంటి మహనీయులు మానవ సమాజానికి ఎంతో కొంత మార్గదర్శకత్వాన్ని చేకూర్చారు. అయితే చిరంజీవులుగా ఉండేవారు ఎవరూ లేరు 'జాత్యస్యః మరణం ధృవం' అన్నట్లే కౌసల్యకు జన్మించిన రాముడు, అంజనీపుత్రుడైన ఆంజనేయుడు, మేరీ మాతకు జన్మించిన ఏసుక్రీస్తు, దేవకీదేవికి జన్మించిన కృష్ణుడు ఇలా ఎవరైనా వారికి కూడా ఆ నియమం వర్తిస్తుంది. అయితే, క్రమేపీ అలాంటి మంచివారిని, వీరులను, సమర్ధవంతమైన పాలకులను స్మరించుకునే సందర్భాలలో చరిత్ర గతిలో వారికి ఉన్న శక్తులకు మించి అధికశక్తులను ఆపాదించారు. మానవతీతు లుగా వారిని మలిచారు. ఆ పేరు చెప్పి ప్రజల్లోకి వారి అంశాలు, దైౖవాంశ సంభూతులం మేమే అంటూ పాలకులు ప్రజల్లో ప్రశ్నించకూడని విశ్వాసాలను నింపారు. మతభావాలను నాటారు. వాటిని యథాశక్తి పోషించారు, పోషిస్తున్నారు.

భూమ్మీద సహజంగా దొరికే ఏ రాయికైనా నీటి సాంద్రత (density) కన్నా ఎక్కువ సాంద్రత ఉంటుంది. కేవలం అగ్నిపర్వతాల నుంచి జాలువారే లావా ఎండిపోతే ఏర్పడే రాళ్లకు మాత్రమే నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. భూమిలోపల అరుదుగా లభించే కొన్ని జియోలైట్లకు కూడా కొంతలో కొంత ఈ ధర్మం ఉంది. కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా నేడు నీటికన్నా తక్కువ సాంద్రతగల కఠినమైన ప్రత్యేక కంపోజిట్లను తయారుచేస్తున్నారు. ఒక వస్తువు సాంద్రత నీటి సాంద్రతకన్నా తక్కువ ఉంటే ఆ వస్తువు నీటిపై తేలుతుంది. ఎక్కువగా ఉంటే అది మునుగుతుంది. సమానంగా ఉంటే నీటి మధ్యలో తేలకుండా, మునగకుండా ఉంటుంది. ఈ విషయాల్ని మీరు మీ సైన్స్‌ పాఠాల్లో (ప్లవన సూత్రాలు అనే శీర్షిక కింద) చదువుకునే ఉంటారు. మీరన్న రామసేతు నిర్మాణంలో సముద్రపు నీటిమీద తేలియాడే రాళ్లను వాడినట్లు అర్థం చేసుకోవాలి. కానీ తమాషా ఏమిటంటే రామాయణ గ్రంథం ప్రకారం అవి మునిగే రాళ్లేనని ఒక వానర నాయకుడు వాటిని చేత్తో స్పృశించగానే అవి నీటిపై తేలియాడే లక్షణాలను సంతరించుకున్నాయని చెపుతారు. అలాంటి ధర్మాలున్న రాళ్లు చరిత్రలో ఎక్కడా లేవు. అలాంటి ఊహలు కేవలం కథల్లో మాత్రమే సాధ్యం. ఇప్పుడు రామసేతు అనే పేరుతో ఉన్న భూభాగం సముద్రం అడుగున ఉంది. అది నీటిపైన తేలియాడుతూ లేదు. భారత భూభాగానికి, శ్రీలంకకూ మధ్య తక్కువ ఎత్తుగల పర్వతశ్రేణి అది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సంభవించిన ఖండాంతర చలనం (continental drift) వల్ల భూభాగాలు విడివిడిగా చీలి సముద్రజలాల మధ్య ద్వీపాలుగా, ద్వీపకల్పాలుగా ఉంటున్నాయి. అలాంటి ఖండాంతర చలనంలో శ్రీలంక భూభా గం భారత భూభాగం నుండి విడివడినప్పుడు ఏర్పడిన పర్వతశ్రేణే ఈ రామసేతు. కాబట్టి ఈ రామసేతు ఓ ప్రకృతిసిద్ధమైన సహజ నిర్మాణ మేనని, ఎవరో పనిగట్టుకొని నిర్మించిన వారధి కాదని భూగర్భ పరిశో ధనలు తిరుగులేని సాక్ష్యాలతో ఋజువు చేశాయి. మహత్తులున్న వ్యక్తులు చరిత్రలో లేరని, కేవలం కథల్లో మాత్రమే ఉండగలరని మనం భావించినప్పుడు పురాణగ్రంథాలను కథలుగా మాత్రమే చూడగలుగుతాం.

  • Bookmark and Share



విజ్ఞానశాస్త్రంపై మతదాడి-3

4 వ్యాఖ్యలు

ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుని రచన ''బ్రహ్మ సిద్ధాంతాన్ని'' పరిశీలిద్దాం. ఈయన గ్రహణాన్ని గూర్చి తన గ్రంథం మొదట్లో ఇలా రాశాడు. కొంతమంది గ్రహణానికి రాహువు శిరస్సు కారణం కాదని భావిస్తారు. ఇది చాలా బుద్ధిలేని ఆలోచన. ఎందుకంటే రాహువే గ్రహణానికి కారణం. రాహువు శిరస్సు వల్ల గ్రహణం కలగకపోతే బ్రాహ్మణులు పాటించే పూజలు మొదలైన ఆచారాలు భ్రమలు కావాలి. ప్రజలు ఈ ప్రసిద్ధ ఆచారాలను అనుసరిస్తున్నారు. కాబట్టి వరాహమిహిరుడు అను రచయితలు ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకించడం మానుకోవాలి.'' గ్రంథం మొదట్లో ఈ భావనను వెలువరించిన రచయిత, కొన్ని అధ్యయనాల తర్వాత గ్రహణానికి కారణం 'సూర్య-చంద్ర-భూమి' సిద్ధాంతాన్ని ప్రవచిస్తాడు. చంద్రుని వ్యాసార్థాన్ని, భూమి నీడ వ్యాసార్థాన్ని లెక్కగడతాడు. ఇలా పరస్పర విరుద్ధ భావాలను రచయిత ఒకే గ్రంథంలో ఎందుకు ప్రకటించాడు? దీని కారణాన్ని 11వ శతాబ్దానికి చెందిన మధ్య ఆసియా యాత్రికుడు 'ఆల్‌ బెరూనీ' ఇలా ఊహిస్తాడు. ''బ్రహ్మగుప్తుడు గ్రహణాల విషయంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వెలువరించడానికి కారణం అతని భద్రతకు ఉన్న ప్రమాదమే అయి ఉంటుందని నా విశ్వాసం. అతని విజ్ఞానం, బుద్ధి కుశలత, నిండు యవ్వనం ఆ ప్రమాదం ముందు ఎందుకూ పనిరాకుండా పోయాయి. బ్రహ్మ సిద్ధాంతం రాసేనాటికి అతని వయస్సు 30 సంవత్సరాలే.'' బ్రహ్మగుప్తుడు ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధ అభిప్రాయాలను వెలువరించడానికి ఆల్‌బెరూనీ పేర్కొన్నట్లు నిండు యవ్వనంలో ఉన్న అతనిపై మతనాయకులు వత్తిడి కాకుండా, వేరే కారణాన్ని ఊహించగలమా?' మరో ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు. ఖగోళశాస్త్రాలపై తాను రచించిన 'బృహత్‌ సంహిత' అనే గ్రంథంలో గ్రహణాల వంటి అంశాలను సూర్య-భూమి-చంద్ర సిద్ధాంతంతో వివరిస్తాడు. అయితే, దానిలో ఒక అధ్యాయం పూర్తిగా మతనాయకులు ప్రవచించే మూఢనమ్మకాల వివరణకే కేటాయిస్తాడు. దీనిలో పురుషాంగానికి, పిల్లల పుట్టుకకు ఉన్న సంబంధాన్ని వర్ణించలేని భాషలో అసహ్యాంగా రాస్తాడు (గృహసంహిత 68వ పేజీ). ఏమిటీ అశాస్త్రీయ, అశ్లీల రాతలు? మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఈ విషయాలను ఎందుకు రాయవలసి వచ్చింది? మత నాయకుల భావాలు అవి ఎంత అశాస్త్రీయమైనా, వాటిని చేర్చకపోతే తన గ్రంథం వెలుగుచూడని పరిస్థితేనా దీనికి కారణం? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ప్రాచీన కాలంలోనే కాదు.. నేడు కూడా మతోన్మాదులు శాస్త్ర విషయాల ప్రచారం అంటేనే భయపడిపోతున్నారు. దీనిని తీవ్రంగా అడ్డుకుంటున్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఉదాహరణకు: ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పి.ఎం.భార్గవ 1975-77 మధ్య 'సైన్స్‌ పద్ధతి' అనే ఒక ఎగ్జిబిషన్‌ను తయారుచేశాడు. దాని ఆవిష్కరణ జరగక మునుపే వందలాది చిత్రాలను, పరిశోధనా పరికరాలతో కూడిన ఆ ఎగ్జిబిషన్‌ను కొందరు సంఘపరివార్‌ వాలంటీర్లు అతికొద్ది సమయంలో (1978 ఆగస్టులో) తరలించారు. ఆ విధంగా జాతీయస్థాయిలో ఈ ప్రదర్శనను అడ్డుకొన్నారు. ఫలితంగా, ఈ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు తరలించబడింది. ఆ హడావిడిలో అత్యంత విలువైన అనేక సైన్స్‌ పరికరాలు ధ్వంసమయ్యాయి. (ఏంజెల్స్‌, డెవిల్స్‌ అండ్‌ సైన్స్‌-పి.ఎం.భార్గవ, చందనా చక్రవర్తి 155 నుండి 169వ పేజీ). విజ్ఞాన శాస్త్ర పద్ధతి అంటే మతోన్మాదులకు ఎంత భయమో ఇది తెలుపుతుంది.

3, ఆగస్టు 2009, సోమవారం

విమాన కంపెనీల వాదములో నిజమెంత?

2 వ్యాఖ్యలు
వారేమీ వ్యాపారలావాదేవీల్లో అనుభవంలేని కుర్ర వ్యాపారవేత్తలు కాదు. ఇతర రంగాలలో లాభాలు పిండుకుంటూ కొత్తరంగాలకు విస్తరించి తమ సంపద సామ్రాజ్యాలను పెంచుకోవాలన్న బడావ్యక్తులు. వీరిలో చీప్‌లిక్కర్‌ నుంచి ఖరీదైన స్కాచ్‌వరకు అన్ని రకాల మద్యం తయారు చేసి విక్రయించే విజయమాల్య ఒకరైతే. విమాన టిక్కెట్లు అమ్మే ఏజన్సీతో జీవితాన్ని ప్రారంభించి ఏకంగా విమానకంపెనీకే అధిపతి అయిన నరేష్‌ గోయల్‌ మరొకరు. కింగ్‌ఫిషర్‌, జట్‌ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఇండిగో,గోఎయిర్‌ కంపెనీల యజమానులతో కూడిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఫెడరేషన్‌ ఇంధనం పన్ను, విమానాశ్రయాల వినియోగ రుసుములను తగ్గించకపోతే ఈనెల 18న ఒక రోజు సమ్మె చేస్తామని ప్రభుత్వానికి శ్రీముఖం జారీ చేసింది. ఇతర రంగాలలోని ప్రైవేటు కంపెనీలు ఉద్దీపన పేరుతో రాయితీలు పొందుతున్నపుడు తాము మాత్రం ఎందుకు వెనకపడాలని ఈ కంపెనీల యజమానులు ప్రభుత్వంపై బెదిరింపులు, వత్తిడికి పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి ఉద్దీపన పథకాన్ని ఆశించవద్దని, సమ్మె చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ హెచ్చరించారు. పెరిగిన ఇంధన ధరలతో వైమానికరంగం తీవ్రంగా గాయపడిందని, తాము దయా ధర్మాలు అడగటం లేదని పన్నులు, చార్జీలను హేతుబద్దం చేయాలని మాత్రమే కోరుతున్నామని కంపెనీల ప్రతినిధులు కింగ్‌ఫిషర్‌ విజరు మాల్య, జట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ అంటున్నారు. కావాలంటే మాకంపెనీల్లో ప్రభుత్వానికి వాటాలిస్తామని చెబుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ధరలు తగ్గాయంటే అవి విమానఛార్జీలు మాత్రమే. విమానయాన రంగంలో ప్రైవేటు కంపెనీలకు అవకాశం ఇవ్వాలని వత్తిడి తెచ్చిన వ్యాపారవేత్తలు తీరా అనుమతించిన తరువాత ప్రభుత్వరంగ విమాన సంస్థను దెబ్బతీసేందుకు చేయని యత్నం లేదు. ప్రైవేటు కంపెనీలు ప్రయాణీకులను తమవైపు రాబట్టుకొనేందుకు పోటీబడి విమాన ఛార్జీలను తగ్గించాయి. ఛార్జీలు తీసుకొని ఇంధనఛార్జీలు, పన్నులను మాత్రమే వసూలు చేసి విమానాలకు ప్రయాణీకులను అలవాటుపడేట్లు చేశారు. ఐటి రంగంలో పనిచేసే అనేక మంది విమానం మినహా ఇతరంగా ప్రయాణించటం పరువు తక్కువగా భావించారు. దాన్ని ప్రైవేటు విమానకంపెనీలు సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడు ఐటి బుడగ పేలిపోవటంతో పాటు అనేక రంగాలపై ప్రపంచ ఆర్థిక మాంద్య ప్రభావం పడింది. విమానాలు ఎక్కేవారు తగ్గిపోయారు. కనుక తాము చార్జీలు పెంచకుండా, తమ లాభాలు తగ్గకుండా తమకు రాయితీలు కావాలని విమాన కంపెనీల యజమానులు వత్తిడి తెస్తున్నారు. సామాన్యులు ఎక్కే ఆర్‌టిసి బస్సులకు వినియోగించే డీజిల్‌, ఇటీవల విపరీతంగా పెరిగిన కందిపప్పు మీద పన్ను తగ్గించటానికి ససేమిరా అన్న ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ మిగతా రాష్ట్రాలతో పోటీబడి విమాన ఇంధనంపై పన్ను తగ్గించారు. అందువల్లనే సామాన్యులు వాడే పెట్రోలు లీటరు రు.50 అయితే విమానాల పెట్రోలు రు.36కే పోస్తున్నారు. అయినా ధర ఇంకా ఎక్కువగా ఉందని, మాదగ్గర వసూలు చేసిన అధిక సొమ్ముతో సామాన్యులకు కిరోసిన్‌ సబ్సిడీ ఇస్తున్నారని విమాన కంపెనీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. మా కంపెనీలు లేకపోతే ప్రయాణీకుల డిమాండ్‌ను ఎలా తట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. నాకోడి కూయకుండా ఎలా తెల్లవారుతుందో చూస్తామని వాదిస్తున్నట్లుంది. విమానాశ్రయాలు ప్రైవేటురంగంలో ఏర్పాటు చేయటం అనర్దదాయకం అని ప్రభుత్వరంగ విమాన సంస్థల సిబ్బంది ఆందోళన చేసినపుడు విజయమాల్య వంటి పెద్దలు ప్రైవేటు రంగానికే మద్దతుపలికారు. హైదరాబాదులోని ప్రైవేటు విమానాశ్రయంలో వసూలు చేస్తున్న వినియోగరుసుములను చూసి విమానాశ్రయం బాగానే ఉందిగానీ అక్కడ వసూలు చేసే రుసుముల్నే భరించలేం అని అనేక మంది గుండెలు బాదుకుంటున్నారు. తమకు దెబ్బతగలనంత వరకు వాటి గురించి నోరుమెదపని విమాన కంపెనీలు ఇప్పుడు తమకే ఆ సెగ తగలటంతో నానాయాగీ చేస్తున్నాయి. ప్రభుత్వం నియంత్రణ ధరల విధానానికి స్వస్తిపలకాలని చెప్పిన వారే ఇప్పుడు తమకు కావాల్సిన ఇంధనానికి దానిని వర్తింపచేయాలని, నిత్యావసర సరకుగా పరిగణించాలని కోరటం దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా ఉంది. వారి డిమాండ్‌ ఏవిధంగా చూసినా సమర్థనీయం కాదు. తమకు గిట్టుబాటుగాక పోతే ధరలు పెంచుకొనే స్వేచ్ఛవారికి ఎలాగూ ఉంది. తక్కువ మందే ఎక్కుతారనుకుంటే విమానాలు, ప్రయాణాల సంఖ్యను తగ్గించుకోవచ్చు. అంతే తప్ప విమానాలకు భారీ రాయతీలిచ్చి బడాబాబులను దర్జాగా తిప్పే శక్తి మన పన్ను చెల్లింపుదార్లకు లేదు, అలా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. విమాన ఇంధనం ధర లీటర్‌ 70 రూపాయలు ఉన్నపుడు మౌనంగా ఉన్న ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు 36-45 రూపాయలకు తగ్గినపుడు ఆందోళన హెచ్చరిక చేయటం ఎందుకన్న ప్రశ్న అనేక మందిలో ఉదయిస్తోంది. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ విమాన సంస్థ నష్టాలపాలైంది. దానిని ఆదుకొనేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. కనుక పనిలో పనిగా తాము కూడా కొన్ని రాయితీలు సాధించుకోవాలని ప్రైవేటు కంపెనీలు పూనుకున్నాయి. మనిషికి రోగనిరోధక శక్తిలేనపుడు ఎన్నిటానిక్కులు ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగే సమాజంలో కొనుగోలు శక్తి తగ్గినపుడు కంపెనీలకు ఉద్దీపన పథకాలు ఇచ్చి ప్రయోజనం లేదు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా కంపెనీలకు రాయితీలవ్వడం వల్ల జనానికి కలిగే లాభమేమీ లేదు. ప్రభుత్వరంగ సంస్థలను భిన్న దృష్టిలో చూడాలి. అవి ప్రజల ఆస్తులు.వాటికి లాభాలు వచ్చినపుడు జనానికి పంచాయి. అందువలన నష్టాలు వచ్చినపుడు వాటిని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత. రాయితీలు తీసుకొని కంపెనీలను దివాలా తీయించి మదుపుదార్లను ముంచిన ప్రైవేటురంగ పెద్దలెందరో మన కళ్లముందున్నారు. అందువలన ప్రైవేటు విమానయాన కంపెనీలు తెచ్చే వత్తిళ్లకు ప్రభుత్వం లొంగనవసరం లేదు. వాటికి జనం సొమ్మును కట్టబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు.