వీలుంటే నా నాలుగు లంకెలు ...

25, ఆగస్టు 2010, బుధవారం

అణు పరిహార బిల్లు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతున్న ప్రభుత్వం

2 వ్యాఖ్యలు
అమెరికన్‌ సప్లయర్స్‌ ప్రయోజనాలు కాపాడేందుకు బిజెపి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతోంది. అణు ప్రమాద పరిహారం రు. 1500 కోట్ల పరిమితి పెట్టడమంటే భోపాల్‌ బాధితులకు ఇచ్చిన 47 కోట్ల డాలర్ల పరిహారం కన్నా తక్కువ చెల్లించమని అడగడం కాదా? అందుకే ఈ అణు పరిహార బిల్లును అడ్డుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. ఇటువంటి నికృష్టమైన బిల్లును ఆమోదించవద్దని పార్లమెంటు సభ్యులపై ప్రజలు పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావాలి. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పార్లమెంటు ఇలాగే ఆమోదించినట్లైతే భారత్‌ - అమెరికా అణు ఒప్పంద సుదీర్థ చరిత్రలో అదొక విషాద ఘట్టంగా మిగిలిపోతుంది.
అణు పరిహార బిల్లు ఇప్పుడు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి వెళ్ళింది. దానికి కొన్ని సవరణలు చేర్చారు. ఈ బిల్లు ప్రధాన ధ్యాస అంతా ఏదైనా అణు ప్రమాదం సంభవించినప్పుడు సరఫరా దారులను కాపాడడమే గాక, ఆ మేరకు చట్టాన్ని మరింత పటిష్టపరిచేదిగా వుంది. దురదృష్టవశాత్తూ బిజెపి వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిల్లులోని ఈ అంశాన్ని చూడ నిరాకరించడమో లేక విదేశీ సప్లయర్స్‌ను కాపాడాలన్న ఉద్దేశమో కానీ ప్రభుత్వంతో వ్యూహాత్మకంగా ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రాజ్యసభలో ఇప్పుడు మెజారిటీ చేకూరింది. అలాగే ఈ బిల్లు ఆమోదానికి కూడా అడ్డులేకుండా చూసుకుంది. ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రతిక్షాలేమైనా వున్నాయి అంటే అవి వామపక్షాలు మాత్రమే. ఈ అణు పరిహార బిల్లులో ప్రధాన అంశాలు ఏమిటి? ఇప్పటికే విస్తృతంగా వచ్చిన వార్తా కథనాలను బట్టి అణు ప్రమాదం జరిగినప్పుడు చెల్లించాల్సిన పూర్తి పరిహారాన్ని 300 ఎస్‌డిఆర్‌లకు అంటే రు.2,500 కోట్లకు పరిమితం చేశారు. ఇది ఆపరేటరు, ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించినది మాత్రమే. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే నష్టం రు. 2,500 కోట్లకు దాటినా ఈ పరిమితికి మించి ఒక్క పైసా కూడా అదనంగా బాధితులకు చెల్లించరన్నమాట. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో ఏమైందో మనం చూశాము. విషవాయువుల లీక్‌ కన్నా మరింత ఎక్కువ నష్టం అణు ప్రమాదం వల్ల వాటిల్లే అవకాశముంది. అప్పుడు చెల్లించే మొత్తం నష్టపరిహారం 47 కోట్ల డాలర్లు ఏ మూలకూ చాలవు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఇప్పుడు అంగీకరిస్తున్నది.ఇది భోపాల్‌ పరిహారం కన్నా తక్కువేనని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇప్పుడు అంగీకరిస్తున్నది. అలాగే పార్లమెంటులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు భోపాల్‌ గ్యాస్‌ వినాశనాన్ని వివిధ దశల్లో చూసినవే. అయినా దాని నుంచి అవి ఎలాంటి గుణపాఠాలు తీసుకోలేదు. ఈ అంశంపై వామపక్షాలు, అలాగే ప్రజా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఆందోళనను స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వం తన బాధ్యతలను తాను నిర్వర్తించగలగాలన్నా ఈ ప్రమాద పరిహారంపై కృత్రిమ పరిమితి తొలగించడం మినహా మరో దారి లేదని చెప్పారు. అణు నష్ట పరిహారానికి పరిమితి విధించడమంటే అర్థమేమిటి? అణు కర్మాగారాలలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదాల్లో 30 కోట్ల ఎస్‌డిఆర్‌లకు మించదని ప్రభుత్వం చెప్పదలచుకున్నదా? అలాగే అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి వుండదు. ప్రభుత్వం ఇలా పరిమితులు విధిస్తూ పోతే ఏ నష్టాలకైనా పరిహారం చెల్లించగలదా? ఇతరులెవరూ ఇలా నష్ట పరిహారంపై ఎలాంటి పరిమితులు పెట్టనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టాలి అని వామపక్షాలు వాదిస్తున్నది కరెక్టు. అణు ప్రమాదం జరిగితే ప్రజలెదుర్కొనే అన్ని సమస్యలకు ప్రభుత్వమే అంతిమంగా బాధ్యత వహించాల్సి వుంటుంది. గనుక ప్రభుత్వం తన బాధ్యతలపై తానే కృత్రిమంగా పరిమితులు విధించుకోజాలదు అని వామపక్షాలు వాదిస్తున్నాయి.

ఇక్కడ ఉత్పన్నమయ్యే మరో ప్రశ్న ఏమిటంటే దీంట్లో ఆపరేటర్‌ బాధ్యత ఏమిటి? మొదట రూపొందించిన అసలు బిల్లులో అణు విద్యుత్‌ రంగంలోకి ప్రయివేటు ఆపరేటర్లు ప్రవేశించే అవకాశం వుందని పేర్కొన్నారు. అయితే మొత్తం బాధ్యతలో వీరి బాధ్యత చాలా స్వల్పంగా మాత్రమే వుంటుందని చెప్పారు. అణు బాధ్యతలో ఆపరేటర్లకు పరిమితులు విధించడమంటే ప్రయివేటు పెట్టుబడికి రాయితీలు ఇవ్వడంగానే చూడాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇప్పుడు రెండు సవరణలను ముందుకు తెచ్చింది. మొదటిది, ఈ బిల్లును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే పరిమితం గావించడం, రెండవది, అణు పరిహార పరిమితిని రు.1500 కోట్లకు పెంచడం. చాలా స్వల్ప బాధ్యత మాత్రమే వహించే ప్రయివేటు రంగం అణు విద్యుత్‌ రంగంలో ప్రవేశించే అవకాశాలకు అడ్డుకట్ట వేసే దిశగా స్థాయీ సంఘం తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినది. అయితే ప్రభుత్వమే యజమానిగా వున్నప్పుడు పస్తుత బిల్లులో ప్రత్యేకంగా ఆపరేటర్‌ పరిహార పరిమితి ఎందుకు విధించినట్లు? ఇక్కడే అసలు కిటుకంతా వుంది. ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్‌ 17ను గనుక మనం చూస్తే ఆపరేటర్‌ మాత్రమే సప్లయర్‌ నుంచి పరిహారం కోరగలడు. అయితే ఆ పరిహారం కూడా సప్లయిర్స్‌కు వాస్తవంగా విధించిన పరిమితులలోపే పొందగలడు తప్ప అంతకుమించి ఒక్క పైసా కూడా అదనంగా కూడా తీసుకోలేడు. ప్రభుత్వ బాధ్యత కూడా అణు ఆపరేటర్‌గా పరిహారాన్ని వున్న పరిమితుల మేరకు చెల్లిస్తుందే తప్ప ప్రభుత్వంగా ఎలాంటి బాధ్యత వహించదు. ఈ బిల్లులో సప్లయర్‌ చెల్లించే పరిహారంపై 1500 కోట్ల మేర పరిమితి విధించారు. అంటే నష్టం 1500 కోట్లు దాటితే ప్రభుత్వమే చెల్లించాల్సి వుంటుంది. ఎందుకంటే సప్లయర్‌ నుంచి రు.1500 కోట్ల కు మించి పరిహారం వసూలు చేయరాదని బిల్లు స్పష్టంగా చెబుతోంది. ఒరిజినల్‌ బిల్లులోని సెక్షన్‌ 17 సప్లయర్‌ బాధ్యతకు సంబంధించి ఏం చెప్పిందో చూడండి.17. అణు విద్యుత్‌ సంస్థ ఆపరేటర్‌ నష్ట పరిహారాన్ని అణు సరఫరాదారు నుంచి ఎప్పుడు కోరవచ్చో ఈ సెక్షన్‌లోని సబ్‌ క్లాజ్‌ (ఎ)లో ఇలా చెప్పడం జరిగింది. సెక్షన్‌ 17(ఎ) ఏం చెబుతోందంటే ఆపరేటర్‌ సప్లయర్‌తో కుదుర్చుకున్న కాంట్రాక్టులో పేర్కొన్న దాన్ని బట్టే ఈ హక్కు వినియోగం ఆధారపడి వుంటుంది.

17(బి) అణు ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లేక సప్లయర్‌ సరఫరా చేసిన సామగ్రి, పరికరాల్లో పూర్తి నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేక వారు అందించే సేవల్లో లోపం వల్ల జరిగిందా లేక తన ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్న దానిని బట్టి పరిహార చెల్లింపు ఆధారపడుతుంది.
ఈ రెండు సెక్షన్లు వేటికవి స్వతంత్రంగా వ్యవహరించాలని, పార్లమెంటరీ స్థాయీ సంఘం సెక్షన్‌ 17 బలహీనంగా వున్నదని, దీనిని పటిష్టపరచాల్సి వుందని పేర్కొంది. శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి కూడా ఇదే విధంగా అభిప్రాయపడినట్లు ఆ నివేదిక పేర్కొంది.ఒక వేళ ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక సప్లయర్‌ వైపు నుంచి జరిగిన నిర్లక్ష్యమే కారణమా అన్నది నిరూపించడం చాలా కష్టంతో కూడుకున్నది. అలాంటప్పుడు ఆ సామగ్రిని, పరికరాలను సరఫరా చేసిన సప్లయర్‌ ఎలాంటి బాధ్యత వహించాలి అనేదానికి సంబంధించి స్పష్టంగా పేర్కొనాల్సి వుంది. కానీ, సెక్షన్‌ 17(బి) ని పరిశీలిస్తే సప్లయర్‌ సరఫరా చేసిన అణు సామగ్రిలో లోపమందని తేలినా అతను తప్పించుకుపారిపోయేందుకు ఈ క్లాజు ఆసరా ఇస్తున్నది.

అసలు ఈ ఉద్దేశపూర్వకం (ఇంటెంట్‌) అన్న పదాన్ని క్లాజు 17(బి)లో చేర్చడంలో ఆంతర్యమేమిటన్నది ప్రశ్న. ఇంటెంట్‌ అనే పదాన్ని సాధారణంగా నేరాలు, పన్ను చట్టాలలో ఉపయోగిస్తారు. దానిని తీసుకొచ్చి అణు పరిహార చెల్లింపు కేసుల్లో వాడడం ఏ విధంగానూ సరికాదని శాసన వ్యవహారాల విభాగం కార్యదర్శి వాదించారు. దాంతో పార్లమెంటరీ కమిటీ క్లాజ్‌ 17(బి)ని ఇలా సవరించాలని సూచించింది.''ఈ అణు ప్రమాదం నిర్మాణ, డిజైన్‌ల లోపం పర్యవసానంగా కానీ, నాసిరకం సామగ్రి సరఫరా వల్ల కానీ, సేవల్లో లోపం వల్ల కానీ, సప్లయర్‌ వైపు నుంచి మెటీరియల్‌, పరికరాలు, సేవలు అందించడంలో నిర్లక్ష్యం యొక్క ఫలితమే''ఈ సిఫారసు చేసిన తరువాత అసలు వక్రీకరణ చోటు చేసుకుంది. పార్లమెంటరీ కమిటీి సమర్పించిన చివరి ముసాయిదాలో 17(ఎ), 17(బి) క్లాజులను కలుపుతూ మరియు (అండ్‌) అన్న పదాన్ని చేర్చారు. దీనివల్ల 17(ఎ) క్లాజు వర్తించినప్పుడే 17(బి) క్లాజు వర్తిస్తుందని చెప్పింది. అంటే ప్రమాదానికి బాధ్యత వహిస్తామంటూ ముందుగానే లిఖిత పూర్వక ఒప్పందం చేసుకోవాలన్నది షరతు. ఒరిజినల్‌ బిల్లులోని వాటి కన్నా దారుణమైన నిబంధనలు స్థాయీ సంఘం నివేదికలో వచ్చి చేరాయి. ఉద్దేశ పూర్వకంగా , పూర్తి నిర్లక్ష్యం వంటివి చేర్చాక సప్లయర్‌ నుంచి ఆపరేటర్‌ పరిహారం పొందే హక్కును వినియోగించుకోవడం చాలా కష్టమవుతుంది. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎలాంటి ''ఉద్దేశం'' లేనప్పుడే దీనిని వెనక్కి తీసుకుని క్లాజ్‌ 17ని పటిష్ట పరచాలి. లేకుంటే పరిహారం కోరే హక్కు వినియోగానికి సంబంధించి ఆపరేటర్‌కు, సప్లయర్‌కు మధ్య కుదిరే కాంట్రాక్టు అగ్రిమెంటుకు అంతగా విలువ లేకుండా పోతుంది. ఈ క్లాజ్‌ను పటిష్ట పరచాల్సిన అవసరముందని అంగీకరించి కూడా ఎందుకిలా చేశారు? దీనికి సమాధానం చాలా సింపుల్‌. యుపిఏ-2 ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గింది. కాంట్రాక్టులో లేనప్పుడు పరిహార చట్టం వర్తించకుండా చూడాలన్న అమెరికన్‌ సప్లయర్ల డిమాండ్‌కు అనుగుణంగానే దీనిని మార్చేసింది. క్లాజ్‌ 17పై అమెరికన్‌ కంపెనీలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. మొదట వున్న క్లాజ్‌ 17 ప్రకారం కాంట్రాక్టులో పేర్కొన్న దానికి మించి పరిహారం కోరే న్యాయపరమైన హక్కుకు ఆస్కారముండేది. అమెరికన్‌ కంపెనీల ఒత్తిడి ఫలితంగా దీనిని ఇప్పుడు కాంట్రాక్టు అగ్రిమెంటులో పేర్కొన్నదాని వరకే అని పరిమితి విధించింది. నష్ట పరిహారంపై రు. 1500 కోట్ల పరిమితి విధించడానికి కూడా ఇదే కారణం. సప్లయర్‌ బాధ్యత అనేది అమెరికాకు చిరాకు కలిగిస్తున్న అతి ముఖ్యమైన అంశం. కాబట్టి ఆ క్లాజ్‌ కోరలు పీకేసే ప్రయత్నం చేస్తున్నారు. అణు పరిహారానికి సంబంధించి సిఎస్‌సి ( కన్వెన్షన్‌ ఆన్‌ సబ్‌ కన్వెన్షన్‌) పేరుతో ఒక నియమావళిని తీసుకొచ్చి భోపాల్‌ తరువాత ఎక్కడైనా మళ్లీ భారీ ప్రమాదాలు జరిగితే పరిమిత పరిహారం తో అమెరికన్‌ కంపెనీలను బయటపడేసే విధంగా అమెరికా చూసుకుంటున్నది. అమెరికన్‌ అణు సప్లయర్స్‌ లాబీ ప్రతినిధి ఒమర్‌ బ్రౌన్‌ 1999లో ఒక సమావేశంలో మాట్లాడుతూ భారత్‌లో కేసుల విచారణ వల్ల లీగల్‌ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోందని, గనుక భోపాల్‌ తరహాలో అమెరికన్‌ కంపెనీలకు సంబంధించిన ఏ వివాదమైనా అమెరికన్‌ కోర్టుల్లో విచారణకు అనుమతించాలని కోరారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా భారత్‌ అమెరికా చేతిలో సాధనమైన సిఎస్‌సి నిబంధనలకు కట్టుబడి అణు పరిహార బిల్లును తెస్తానని హామీ ఇచ్చి వచ్చింది. 2008 సెప్టెంబరు10న అప్పటి భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్‌ మీనన్‌ అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి విలియం బర్న్స్‌కు రాసిన లేఖలో సిఎస్‌సికి కట్టుబడే అణు పరిహార బిల్లు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీని వల్ల అమెరికన్‌ అణు కంపెనీలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య అణు వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుందని అందులో విశదీకరించారు. ఇప్పుడు సమస్యంతా అణు పరిహార బిల్లు ఆశయాలు, లక్ష్యాలపై కన్నా సిఎస్‌సిలో చేరడంపైనే వచ్చింది. సిఎస్‌సి అనేది అణు సప్లయర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించినదే తప్ప మరొకటి కాదు.
ఈ పరిస్థితుల్లో అమెరికన్‌ సప్లయర్స్‌ ప్రయోజనాలు కాపాడేందుకు బిజెపి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతోంది. అణు ప్రమాద పరిహారం రు. 1500 కోట్ల పరిమితి పెట్టడమంటే భోపాల్‌ బాధితులకు ఇచ్చిన 47 కోట్ల డాలర్ల పరిహారం కన్నా తక్కువ చెల్లించమని అడగడం కాదా? అందుకే ఈ అణు పరిహార బిల్లును అడ్డుకోవాల్సిన అవసరమెంతైనా వుంది. ఇటువంటి నికృష్టమైన బిల్లును ఆమోదించవద్దని పార్లమెంటు సభ్యులపై ప్రజలు పెద్దయెత్తున ఒత్తిడి తీసుకురావాలి. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పార్లమెంటు ఇలాగే ఆమోదించినట్లైతే భారత్‌ - అమెరికా అణు ఒప్పంద సుదీర్థ చరిత్రలో అదొక విషాద ఘట్టంగా మిగిలిపోతుంది.

Copy & Past from ప్రబీర్‌ పుర్కాయస్థ