వీలుంటే నా నాలుగు లంకెలు ...

30, జూన్ 2009, మంగళవారం

విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఇంత ఆతృత ఎందుకో..?

1 వ్యాఖ్యలు
విద్యారంగాన్ని ప్రయివేట్‌ రంగానికి అప్పగించడంలో ఎక్కడలేని ఆతృతను ప్రదర్శించింది యుపిఏ ప్రభుత్వం. కీలకమైన అనేక మార్పులకు తెరతీసే ఫ్రొఫెసర్‌ యశపాల్‌ కమిటీ చేసిన తాత్కాలిక మధ్యంతర సిఫార్సులను వందరోజుల్లో అమలు జరుపుతామని మంత్రి కపిల్‌ సిబాల్‌ ప్రకటించేశారు. ఎంతో కాలంగా అమలుకు నోచుకోని కొఠారి కమిషన్సిఫారసుల గురించి పట్టించుకోకుండా యశ్పాల్కమిటీ సిఫారసుల అమలుకు ఎందుకింత తొందరపడుతోంది? ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుండి తప్పించుకుని ప్రయివేటు దోపిడీకి బార్లా తలుపులు తెరవడమే ప్రభుత్వ లక్ష్యమన్నది స్పష్ఠంగా తెలిసిపోయింది. ప్రజల నుండి వసూలు చేసే విద్యా సెస్సు నిధులు ప్రభుత్వం దగ్గర వున్నాయి. విద్యా రంగానికి డబ్బులు ఖర్చు చేయలేని హీన స్థితిలో ప్రభుత్వం లేదు. అయినా విద్యావ్యవస్థను అది కూడా హడావిడిగా వ్యాపారీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. ఇది ప్రజావిశ్వాసాన్ని వమ్ము చేయడమే. యశ్పాల్కమిటీ ఉన్నత విద్యా రంగాన్ని విదేశీ విశ్వవిద్యాలయాల ప్రమాణాలకు దీటుగా వుండాలని కోరితే యుపిఏ ప్రభుత్వం ఏకంగా మన ఉన్నత విద్యను విదేశీ వ్యాపార సంస్థలకు టోకుగా అప్పగించేందుకు పూనుకుంది. ఉన్నత విద్యను పూర్తి వ్యాపార సరుకుగా మార్చేస్తున్నది. ప్రభుత్వానికి లోకసేభలో అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు ఉంది. మా ప్రయోజనాలను కాపాడితే చాలు మిగతా మీరేంచేసుకున్నా మేం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతులెత్తుతాం అనే విధంగా మద్దతుదారులు ఉన్నారు.

27, జూన్ 2009, శనివారం

"విజ్ఞానం" పై చవక బారు విమర్శలా?

3 వ్యాఖ్యలు
జనవిజ్ణానవేదిక కృషిని విస్మరించి చేపమందును వ్యతిరేకించడమే పాపమన్నట్లుగా ఆంధ్రభూమి సంపాదకీయం రాసింది. జనవిజ్ఞాన వేదిక గత 21 సంవత్సరాలుగా శాస్త్రీయ విజ్ఞాన ప్రచారం చేస్తోంది. "యాపిల్‌కన్నా అరటి మిన్న" వంటి సామాన్య విషయాలపై ప్రచారం నుండి దొంగ బాబాలు, అమ్మల బండారాలు బయట పెట్టడం వంటి అసామాన్య విషయాలనెన్నిటినో చేపట్టింది. "రాజుగారి బేదులు" వంటి కళారూపాల ద్వారా విరోచనాలకు కారణమైన కలుషిత నీటిని గూర్చి వివరించింది. మద్యం అనే మహమ్మారిపై నారీ భేరి మోగించింది. వేలాది వయోజన పాఠశాలలు స్థాపించి నిరక్షరాస్యతా నిర్మూలనలో తన చేయందించింది. విద్యార్థి చెకుముకి మాస పత్రిక ద్వారా విద్యార్థులలో సైన్సు ప్రచారం నిర్వహిస్తోంది. అనేక శిక్షణాశిబిరాల నిర్వహణ, పుస్తక ప్రచురణల ద్వారా దేశభక్తిని ప్రచారం చేసింది. ఈ కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2006 లో సైన్సు దినోత్సవం నాడు 2 లక్షల రూపాయల నగదు, ఒక జ్ఞాపికను జనవిజ్ఞాన వేదికకు అందించింది. ఇన్ని మహత్తర కార్యక్రమాలు నిర్వహించి, మరెన్నో గణనీయ విజయాలు సాధించినపుడు ప్రశంసలకు చోటివ్వని ఆంధ్రభూమికి ప్రతిరోజు, ఒక అశాస్త్రీయ కార్యక్రమాన్ని ఎదుర్కొని విజయం సాధించడం బాధాకరంగా తోచడం దురదృష్టకరం. విజ్ఞాన 'భీభత్సం' సంపాదకీయం (ఆంధ్ర భూమి 9.6.09) లోచేప ప్రసాదం ద్వారా చికిత్స పొందుతున్నవారి సంఖ్య గణనీయంగా పడిపోవడంపై ఆ పత్రిక తెగ బాధపడిపోయింది. అసలు మాది చేపమందు కాదు, చేప ప్రసాదం మాత్రమేనని బత్తిన సోదరులు హైకోర్టుకు విన్నవించుకున్నా సదరు ప్రతికలవారికి అది చేపమందుగానే కన్పించడం వింతగా వుంది. ఆ సంపాదకీయంలో 'ఉబ్బసం రోగం నయమవుతుందా లేదా అన్న ప్రత్యక్ష ప్రమాణాన్ని జనవిజ్ఞాన వేదికవారు పక్కకునెట్టేశారు.' అని రాయడం జరిగింది.

అసలు అది మందే కాదు. ప్రసాదమని విద్యాధికులు పేర్కొంటున్నప్పుడు ప్రసాదాలకు వ్యాధులు నయమవుతాయా అనే ప్రశ్న సదరు పత్రికవారికి రాలేదు. ఉబ్బసం తగ్గకపోగా ఒకరి అంగుట్లో పెట్టిన వేళ్ళు మరొకరి నోట్లో పెట్టిన కారణంగా వచ్చిన అంటు వ్యాధులకు చికిత్స చేసిన తర్వాతనే జనవిజ్ఞాన వేదిక నాయకులైన డాక్టర్లు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. 'రోగులకు మందులిస్తున్న ప్రతి అల్లోపతి వైద్యుని వద్దకు వెళ్లి ఇచ్చే మందు ఫార్ములా ఏమిటో చెప్పమని ఈ హేతువాదులు నిలదీయడం లేదనీ' చేప మందులో ఉన్న ఫార్ములా కొరకు మాత్రం నిలదీస్తున్నారని రాయడం నిజాన్ని నిలువులోతులో పాతేయడమే. ఎందుకంటే ప్రతి అల్లోపతి మందు పట్టీపై ప్రతి టాబ్లెట్‌లో ఇన్ని మిల్లీ గ్రాముల ఫలానా పదార్థం వుంటుందని ముద్రించబడి ఉంటుంది. అలా ముద్రించబడని అల్లోపతి మందును ఒక్క దాన్ని చూపమనండి.
"అమెరికాలోను పాశ్చాత్య దేశాలలోను నిషిద్ధమైన మందులను మన దేశంలో అమ్ముతున్న బహుళజాతి వాణిజ్యవేత్తల ఆగడాలు ఈ హేతువాదులకు కన్పించడం లేదని" మరో ఆరోపణ.ఇది వారి అజ్ఞానాన్నే సూచిస్తోంది. ఎందుకంటే జనవిజ్ఞాన వేదిక పుట్టినప్పటినుండి అవసరమైనవి, విషేధింపబడినవి అయిన మందులకు వ్యతిరేకంగా అనేక వందల సెమినార్లు నిర్వహించింది. "మందులా? మారణాయుధాలా?" , "ఆరోగ్యానికి ఎన్ని మందులవసరం" వంటి అనేక పుస్తకాలను ప్రచురించి వేల సంఖ్యలో అమ్మి ప్రజలను జాగృతం చేసింది. ప్రజారోగ్యం ప్రజల చేతుల్లోంచి కార్పొరేట్‌ హాస్పిటళ్ల చేతుల్లోకి వెళ్ళిన వైనాన్ని నిరసిస్తూ జన విజ్ఞానవేదికకు చెందిన వైద్యులు నిరంతరం గొంతెత్తి నినదిస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా "ప్రజారోగ్యం" అనే అంశంపై వందలాదిమంది ప్రజా వైద్యులచే 2008 అక్టోబరు 10,11 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించబడిన సింపోజియం ఆంధ్ర భూమి దృష్టికి రాకపోవడం పాఠకుల దురదృష్టం.అలాంటి జనవిజ్ఞానవేదికను "కార్పొరేట్‌ బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాసేవారు" గా చిత్రించ బూనడం వాస్తవాన్ని అతి హీనంగా వక్రీకరించడమే.
జన విజ్ఞానవేదిక, హైదరాబాద్‌.

పేద ప్రజలతో ప్రపంచ బ్యాంకు మరో లీల

0 వ్యాఖ్యలు
గ్రామీణులకు మినరల్‌ వాటర్‌ ఉచితమా? రొక్కమా? వెల్లడించని వైఎస్‌
గ్రామీణ ప్రజలకు బాటిళ్లలో మినరల్‌ వాటర్‌ను సరఫరా చేస్తామని శుక్రవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభ సందేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆగస్టు 15 నుండి డ్వాక్రా సంఘాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామీణ ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నందున అందరికీ రక్షిత నీటిని అందించనున్నామన్నారు. మినరల్‌ వాటర్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా లేక ఛార్జీలు వసూలు చేస్తారా అన్న విషయాన్ని సిఎం వెల్లడించలేదు. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన జల ముసాయిదాలో తాగునీటిని సైతం విలువ ఆధారంగా చూడాలన్న నిబంధన ఉంది. ప్రపంచ బ్యాంక ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నీటి బొట్టునూ అమ్మాలన్న షరతును అమలు చేసే ఉద్దేశం మినరల్‌ వాటర్‌ సరఫరా వెనుక దాగుందని తెలుస్తోంది

25, జూన్ 2009, గురువారం

యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

0 వ్యాఖ్యలు
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికై హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తదని యజ్ఞం చేసేవారు నమ్ముతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లోనూ యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి మేఘమధనాన్ని చూపెడుతున్నారు. మేఘమధనం ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెపుతున్నారు. ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అని ఆలోచించాలి.
అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్యం సమస్యగా ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం పెరుగుతున్న ఈ నేపథ్యంలో గతంలోలాగా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు ఈ హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.

తమది దేవుడి పాలనని, వరణుడు తమ పార్టీలో చేరిపోయాడని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వరుణ యాగాలు చేయాలని పిలుపునిచ్చారు. పనిలో పనిగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయాలన్నారు. ఆయా దేవాలయాలు, ధార్మిక సంస్థలు తమకు తామే అలా నిర్ణయించుకుంటే ఒక విధంగానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఆదేశాలు వెళ్లడం శాస్త్ర విజ్ఞానాన్ని, సెక్యులర్‌ రాజ్యాంగాన్ని అవమానించడం, అవహేళన చేయడమే అవుతుంది. కంటింజెన్సీ ప్రణాళికల గురించి ఆలోచించకుండా పంట యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇక వ్యవసాయ మంత్రి జులై 15 నుండి మేఘమథనం చేసి వర్షాలు కురిపిస్తామని చెప్తున్నారు. ఫలానా ప్రాంతంలో మేఘమథనం ద్వారా, ఫలానా సమయంలో వర్షం కురిసిందని రూఢిగా నిర్ధారించిన దాఖలా లేదు. ఇంతకీ వర్షాలు కురిస్తే యాగాల వల్ల కురిసినట్టా, ప్రార్థనలకు కరుణించినట్టా లేక మథనంతో జాలువారుతునట్టు భావించాలా? ఏది ఏమైనా ఇప్పుడు అన్నదాత సందిగ్థంలో ఉన్నాడు. సేద్యం సాధ్యం అవుతుందా? అని బెంబేలు పడుతున్నాడు. ఇంతకీ ఏరు వాక సాగేనా!?.

...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

24, జూన్ 2009, బుధవారం

ఉనికి చాటుకోవడానికే 'లాల్‌ఘర్‌'

0 వ్యాఖ్యలు
దేశంలో తమ ఉనికిని చాటుకునేందుకూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకూ పశ్చిమబెంగాల్‌లోని లాల్‌ఘర్‌ను మావోయిస్టులు విముక్తి ప్రాంతంగా ప్రకటించుకున్నారని తెలిసింది. విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని జాబితా తయారు చేసుకుని నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. అందులో చివరన లాల్‌ఘర్‌ ఉంది. మూడు దశాబ్దాలకుపైగా పాలన సాగిస్తున్న వామపక్ష ప్రభుత్వంపై వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద శక్తులు దాడి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమై బెంగాల్‌ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు తీవ్రమైన దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియాలోని ఒక భాగం దానికి తోడ్పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలను కాదని స్వంత పాలనను ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో మావోయిస్టులు సాగించారు. అదే సమయంలో కొందరి నుంచి డబ్బు వసూలు చేయడం, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం లాంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని తెలిసింది. ముఖ్యంగా గిరిజనులను రెచ్చగొట్టడం, శిక్షణ ఇవ్వడం ద్వారా వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని సమాయత్తం చేసే ప్రయత్నం పథకం ప్రకారం సాగింది. సాయుధ శిక్షణ, గెరిల్లా పోరాటం ఎలా నిర్వహించాలి? విధ్వంస చర్యలను ఏ సమయంలో ఎలా సృష్టించాలన్న దానిపై జార్ఖండ్‌ మావోయిస్టులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు పొలిట్‌బ్యూర్‌ సభ్యులు నంబాళ్ల కేశవరావు ఎలియాస్‌ గంగన్న పర్యవేక్షణలో అంతా జరిగిందని తెలిసింది. లాల్‌ఘర్‌ పోరుకు నంబాళ్ల కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. విముక్త ప్రాంతంగా ప్రకటించుకోడానికి ముందు కేశవరావు జార్ఖండ్‌ చేరుకున్నారని, అక్కడి నుంచే లాల్‌ఘర్‌ అపరేషన్‌ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. సాయుధ బలగాలను నిరోధించేందుకు ఏ వంతెనలు కూల్చాలి, రోడ్లెక్కడ దెబ్బతీయాలి, చెట్లను ఎక్కడ కూల్చాలి, ఎలా నిరోధించాలి అన్న దానిపై మావోయిస్టులు ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మందుపాతరలను చాలా ముందుగానే వాటిని అమర్చి ఉంచారని తెలిసింది.
మీడియాపైనా దృష్టి
తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు మీడియాను వాడుకోవాలని మావోయిస్టులు తాజాగా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ ప్రహ్లాద్‌ను తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా లాల్‌ఘర్‌ విషయంలో వరుసగా మూడు రోజులు మీడియాకు కోటేశ్వరరావు సమాచారమందిస్తూ తమ వైఖరిని వెల్లడించారు. ఆయన లాల్‌ఘర్‌ ప్రాంతం నుంచే ప్రకటనలు చేస్తున్నారని మీడియా, పోలీసు వర్గాలు తొలుత భావించాయి. వాస్తవంగా కోటేశ్వరరావు జార్ఖండ్‌ నుంచే మాట్లాడారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోటేశ్వరరావు నాయకత్వంలోనే లాల్‌ఘర్‌ విధ్వంసం మొదలైందని అందరూ భావించినప్పటికీ దాని వ్యూహకర్త నంబాళ్ల కేశవరావేనని రూఢిగా తెలిసింది.
జార్ఖండ్‌లోనే కేశవరావు, కోటేశ్వరరావు?
కేశవరావు, కోటేశ్వరరావులిద్దరూ జార్ఖండ్‌లోని షెల్టర్‌ జోన్‌లో ఉన్నారని, మిగిలిన ఆంధ్ర నాయకత్వమంతా చత్తీస్‌ఘడ్‌లోనే ఉన్నారని భోగట్టా. లాల్‌ఘర్‌తోపాటు మరో ఆరు విముక్తి ప్రాంతాలను మావోయిస్టులు మున్ముందు ప్రకటించనున్నారని తెలిసింది. చత్తీస్‌ఘడ్‌లోని దంతె వాడతోపాటు మరో ప్రాంతం, ఒరిస్సాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, జార్ఖండ్‌లో ఒక ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోని అరకు, పాడేరు ఏజెన్సీలను కూడా విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని లక్ష్యంగా రిక్రూట్‌మెంట్‌ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం పెద్దయెత్తున ఆయుధాలు,కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారమందింది. విముక్తి పోరాటం పేరిట గిరిజనులను సాయుధులుగా చేయాలన్న ఆలోచనలో మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించు కున్నారని, సంస్కరణలు, ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిరుద్యోగం పెరిగే ఈ కాలంలో విముక్తి ప్రాంతాల పోరు సాగించడం ద్వారా నిరుద్యోగ యువతను పార్టీవైపు ఆకర్షించొచ్చని అభిప్రాయపడుతున్నారు.
నేపాల్‌ అనుభవాలతో విముక్తి పోరాటం
నేపాల్‌ అనుభవాలే విముక్తి పోరాటంవైపు ఉసిగొల్పాయని మావోయిస్టులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంవైపు రావాలని ప్రచండ ఇచ్చిన పిలుపును మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పిలుపును తిప్పికొట్టేందుకే లాల్‌ఘర్‌ను ఆయుధంగా ఎంచుకున్నారని తెలిసింది. ప్రజాస్వామ్య దేశంలో వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో సాయుధ పోరాటం చేపట్టడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తమ సిద్ధాంతాలను వ్యతిరేస్తున్న వామపక్ష శక్తులను బలహీనపర్చాలన్న లక్ష్యంతోనే మావోయిస్టులు పనిచేస్తున్నారు. నేపాల్‌తో ముగిసిపోలేదనీ, తాము భారతదేశంలో ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశం మావోయిస్టుల్లో ఉంది. విముక్తి ప్రాంతం ప్రకటించక ముందే లాల్‌ఘర్‌కు అధునాతన ఆయుధాలనూ, రాకెట్‌ లాంచర్లనూ చేరవేశారు. ప్రభుత్వంతో దీర్ఘకాల యుద్ధం చేయలేమని మావోయిస్టులు ముందుగానే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వాటి అనుభవాలను తీసుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనలో వారున్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలను సాధ్యమైనంత ఎక్కువ నష్టపరచాలన్న లక్ష్యంతో మావోయిస్టులు లాల్‌ఘర్‌ పరిసరాల్లో భారీ విధ్వంసక చర్యలకు పూనుకునే అవకాశముందని తెలిసింది.
...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

తృణమూల్‌, మావోయిస్టుల భయానక రాజకీయాలు

4 వ్యాఖ్యలు
ఉగ్రవాదాన్ని విస్తరింపచేయటం ద్వారా భయానక రాజకీయాలకు పాల్పడుతున్న తృణమూల్‌, మావోయిస్టు కూటమి మిడ్నపూర్‌, బంకురా తదితర జిల్లాల్లో రోడ్లు తవ్వుతూ, చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేస్తూ అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవటమే కాక ఈ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. తృణమూల్‌నేత ఛత్రధర్‌ మహతో నేతృత్వంలోని కంగారూ కమిటీ ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతుండటాన్ని గమనిస్తున్న ఇక్కడి ప్రజలు వారి ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా గమనిస్తున్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ, మావోయిస్టు నేత కిషన్‌జీ గత 32 ఏళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ పరిస్థితికి దారి తీశాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగింది గత కొన్నేళ్లుగా మాత్రమే, అదికూడా ఈ ప్రాంతంలో మావోయిస్టు, తృణమూల్‌ కూటమి అరాచకానికి పాల్పడినందువల్లే అభివృద్ధి స్థంభించిపోయింది. ఈ విషయాన్ని స్పష్టం చేసిన బెంగాల్‌ పశ్చిమ ప్రాంత అభివృద్ధి సుశాంతఘోష్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచని గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. బిన్‌పూర్‌1, 2 బ్లాకలేలో అధికశాతం పంచాయితీలు జార్ఖండి పార్టీ పాలనలో వున్నాయి. ఈ ప్రాంతాలలో అభివృద్ధికి నోచని ప్రాంతాలను ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో సమన్వయం చేసుకోలేని లోపం ఆ పార్టీదేనని మంత్రి వివరించారు. తాను స్వయంగా ఈ గ్రామాలకు వెళ్లి ప్రత్యేక పథకాలను మంజూరు చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాల కింద ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీటి సరఫరా, ఆదాయ పెంపుదల, ఉపాధికల్పనతోపాటు పాఠశాలభవనం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం వంటివి చేపట్టారన్నారు. ఈ పథకాలు తొలి ఏడాది నుండే ప్రయోజనాలు అందించాయని, గత ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడినా సురక్షిత తాగునీటిని ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేశామని ఆయన వివరించారు. లాల్‌ఘర్‌, దాని పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులకు నేతృత్వం వహిస్తున్న ఛత్రధర్‌ మహతో గత వారం ఈ ప్రాంతాల్లో మీడియాలోని ఒక వర్గం ప్రతినిధులతో పర్యటించి గత 32 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేసిందేమీ లేదంటూ విషం కక్కారు. రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు తవ్విన కాలువ ఈ ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ వారి సమాధులను వారే తవ్వుకున్నారని నిరసన వ్యక్తంచేస్తూ గిరిజన గ్రామీణులు వేరు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే వీరిని అడ్డుకుంటున్న మావోయిస్టులు తాము కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెబుతున్నారు. తాము కూడా ఇక్కడ ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నామని వారు చెప్పినప్పటికీ అక్కడెక్కడా వైద్యులు కానీ, ఔషధాలు కానీ కన్పించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందే చెప్పినట్టు మావోయిస్టులు మందుపాతర పేల్చి ఒక వైద్యుడిని, నర్స్‌ను హతమార్చటంతో ఈ ప్రాంతాలకు వచ్చి సేవలందించాలంటేనే వారు హడలెత్తిపోతున్నారు.
పర్యాటకానికి గండి కొట్టిన మావోయిస్టులు
ప్రకృతిరమణీయత ఉట్టిపడుతూ గతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ఈ ప్రాంతానికి ఇప్పుడు మావోయిస్టుల దుశ్చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయి. పర్యాటక కేంద్రాలను పేల్చివేసిన మావోయి స్టులు ఈ ప్రాంతంలో పర్యాటకానికి కూడా గండికొట్టారు. అసలు ఈ ప్రాంతానికి మిగిలిన ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసేందుకు వారు రోడ్డు ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ బెడదతను తట్టుకోలేని కంపెనీలు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి పోయాయి. అంతేకాదు మావోయిస్టులు ఇక్కడ ఒక వ్యూ హం ప్రకారం ఒకదాని వెంట ఒకటిగా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ధ్వంసం చేశారు. ముఖ్యంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఆర్దిక వనరులు సంపాదించు కునేందుకు భారీమొత్తంలో చెట్లను తెగనరికి టింబర్‌ మాఫియాకు తెగనమ్మేశారు.
ఈ విధంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలకు సామాన్యులనే కాక పర్యావరణాన్ని కూడా బలిపెట్టారు. మావోయిస్టుల దాడుల కారణంగా ఈ ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. బెంగాల్‌ పశ్చిమ ప్రాంతం, సుందర్‌బన్స్‌, ఉత్తర బెంగాల్‌ల అభివృద్ధికి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపులను 190 కోట్ల నుండి 285 కోట్ల రూపాయలకు పెంచింది. లాల్‌ఘర్‌ ప్రాంత గిరిజనులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందచేసేందుకు ఈ ప్రాంతంలోని వైద్య కేంద్రాలన్నింటి స్థాయిని పెంచింది. ఈ ప్రాంతంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉమ్మడిగా దుష్ప్రచారం చేసినా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి లెఫ్ట్‌ఫ్రంట్‌ తరపున పోటీ చేసిన సిపిఎం అభ్యర్ధి పులిన్‌ బిహారీ బాస్కీకి దాదాపు 65 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.

ప్రాణస్నేహితులు

0 వ్యాఖ్యలు

Please click on Play button to listen my favorite song
0 వ్యాఖ్యలు

మావోయిస్టు నిషేధం పరిష్కారం కాదు

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు)ను దేశ వ్యాప్తంగా నిషేధించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమస్యను నిషేధంతో పరిష్కరించడానికి విఫలయత్నం చేసింది. ఉగ్రవాదుల సరసన మావోయిస్టులను చేర్చి శాంతిభద్రతల అంశానికి పరిమితం చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. వాస్తవానికి మావోయిస్టుపార్టీపై నిషేధం కొత్తదేం కాదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద ఇప్పటికే కేంద్రం నిషేధించిన సంస్థల జాబితాలో సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) చేరి ఉన్నాయి. 2004 సెప్టెంబర్‌లో అవి రెండూ విలీనమయ్యాయి. మావోయిస్టుపార్టీ అవతరించింది. వేర్వేరుగా ఉన్న సంస్థలు ఒకే పార్టీగా ఏర్పడటంతో సాంకేతికంగా దానిపై బ్యాన్‌ లేదు. స్పష్టత కల్పించేందుకు మావోయిస్టుపార్టీని నిషేధిత సంస్థల జాబితాలో చేర్చామంటున్నారు చిదంబరం. ఇప్పటికే బ్యాన్‌ పెట్టిన 34 సంస్థలుండగా మావోయిస్టుపార్టీ ముప్పైఐదవది, లష్కరేతోయిబా, సిమి, ఎల్‌టిటిఇ సరసన చేరింది. సాధారణంగా దేశం వెలుపలి నుండి వచ్చే నిధులు, ఆయుధాలతో నడుస్తున్న వాటిని ఉగ్రవాద సంస్థలుగా చెబుతున్నారు. దేశం లోపల అంతర్గతంగా పని చేస్తున్నవాటిని తీవ్రవాద సంస్థలుగా పేర్కొంటున్నారు. కొన్ని నక్సలైట్‌ గ్రూపులపై వివిధ రాష్ట్రాల్లో ఎప్పటి నుండో నిషేధం అమల్లో ఉంది. పీపుల్స్‌వార్‌, ఆ తర్వాత ఏర్పడిన మావోయిస్టుపార్టీని చట్ట వ్యతిరేక సంస్థలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలు నిషేధించాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం కింద బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, తమిళనాడు ప్రభుత్వాలు బ్యాన్‌ విధించాయి.

నక్సల్స్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాలి. రాష్ట్రంలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలను 1978 ప్రాంతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్బంధం అమలు చేశారు. 1980లో పీపుల్స్‌వార్‌ ఏర్పాటయ్యాక దాని కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం 'వార్‌'పై నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. 1989లో మర్రి చెన్నారెడ్డి సర్కారు నిర్భందాన్ని సడలించగా 1992లో తొలిసారి నేదురుమల్లి నిషేధం విధించారు. 1995లో ఎన్టీఆర్‌ సడలించగా 1996లో చంద్రబాబు మళ్లీ నిషేధం విధించారు. 2004లో వైఎస్‌ బ్యాన్‌ను సడలించి నక్సల్‌ నేతలతో నేరుగా చర్చలు జరిపారు. 2005లో మళ్లీ నిషేధం విధించారు. అందరికంటే ముందుగా బీహార్‌లో 1986లో ఎంసిసిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్‌ విధించింది. సాంకేతికంగా మావోయిస్టుపార్టీ పేరు నిషిద్ధ సంస్థల జాబితాలో లేకపోయినా దానిలో విలీనమైన రెండు గ్రూపులనూ కేంద్రం ఎప్పుడో నిషేధించింది. దేశంలో, రాష్ట్రాల్లో బ్యాన్‌ ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు, ఎన్‌కౌంటర్లు తాత్కాలికంగా మినహా పూర్తిస్థాయిలో అదుపు చేయడం సాధ్యం కాదని తేటతెల్లమైనా ఇప్పుడు కొత్తగా కేంద్రం బ్యాన్‌ విధించడం దేనికి? రాజకీయ ప్రయోజనాలను ఆశించే సరిగ్గా బెంగాల్‌లో లాల్‌ఘర్‌ ఉదంతం ముందుకొచ్చిన సమయంలో నిషేధం విధించింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లినప్పుడు స్పందించకుండా లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న బెంగాల్‌లో కొన్ని ఘటనలు చూపి బ్యాన్‌ పెట్టింది. ఆ రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తోంది. బెంగాల్‌లో లెఫ్ట్‌ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి, ఇబ్బందులు సృష్టించడానికి ఇప్పటి వరకూ మావోయిస్టుల హింసకు మద్దతు పలికిన తృణమూల్‌ కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామి. లాల్‌ఘర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ప్రముఖులెవ్వరూ సందర్శించవద్దని కేంద్ర హోంమంత్రి ప్రకటించినా తృణమూల్‌ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని మరింత క్షీణింపజేశారు. వీరంతా ఒకే కేబినెట్‌లో సభ్యులు. వారి ఉమ్మడి బాధ్యత ఎలా ఉందో ఈ చర్య విదితమవుతోంది.
మావోయిస్టుపార్టీపై నిషేధం విధించాలని గత యుపిఎ ప్రభుత్వం ఆలోచన చేసింది. లెఫ్ట్‌ మద్దతుపై సర్కారు మనుగడ సాగిస్తుండటంతో అప్పుడు ఆ సాహసం చేయలేకపోయింది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో బ్యాన్‌ పెట్టింది. నిషేధం వల్ల నక్సల్‌ సమస్యను పరిష్కరించలేమని వామపక్షాలు అందులోనూ సిపిఎం చెబుతూ వచ్చింది. అందుకే కేంద్ర హోంమంత్రి చిదంబరం నిషేధించాలని సూచించినా బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ అంగీకరించలేదు. కేంద్రం బ్యాన్‌ పెట్టగానే వామపక్షాలు వ్యతిరేకించాయి. నిషేధం దేశం మొత్తానికీ వర్తిస్తున్నందున బెంగాల్‌లో తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలపై చర్చిస్తున్నామని లెఫ్ట్‌ సర్కారు పేర్కొంది. నిషేధంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, మావోయిస్టులను ప్రజల నుండి వేరు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ చెప్పారు. నిరంతర రాజకీయపోరాటం తప్ప సమస్యకు బ్యాన్‌ పరిష్కారంకాదని బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ స్పష్టం చేసింది. నిషేధాన్ని కాంగ్రెస్‌, బిజెపి స్వాగతించడం, వామపక్షాలు వ్యతిరేకించడం ఇందుకే. పై పూతలు, తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యలను తగ్గించే రాజకీయ పరిష్కారమే అసలైన మందు.

0 వ్యాఖ్యలు

మావోయిస్టులకు, ఉగ్రవాదులకు మధ్య...నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా

ఉగ్రవాదులను, మావోయిస్టులను ఒక గాటన కట్టి కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. సామాజిక, సైద్ధాంతిక, రాజకీయ పునాదిగా వున్న మావోయిస్టులకు, అరాచకత్వమే లక్ష్యంగా వున్న ఉగ్రవాదులకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుందని చెప్పారు.

21, జూన్ 2009, ఆదివారం

0 వ్యాఖ్యలు
మహాకవి శ్రీశ్రీ శతజయంతి
మహాకవి శ్రీశ్రీ శతజయంతి(1910-2010) ఉత్సవాలు మరే ఆధునిక తెలుగు కవికి, రచయితకు జరగనంత ఘనంగా విస్త్రతంగా జరుగుతున్న సందర్భం. జూన్‌ 15 ఆయన వర్థంతి.
శ్రీశ్రీ 1910 ఏప్రిల్‌ 30 న విశాఖపట్టణంలో పుట్టారు.తండ్రి వెంకటరమణయ్య లెక్కల మాష్టారు.తల్లి అప్పలకొండమ్మ. కొడుకు పుట్టాక ఆర్నెల్లకే ఆమె చనిపోయారు. తనను ఎందరో తల్లులు స్తన్యమిచ్చి పెంచారంటాడు ఆయన. తల్లికి చిన్నప్పుడే దూరమైన కారణంగా తనలో ప్రేమ పట్ల అవిశ్వాసం పెరిగిందని చెబుతాడు. కాని తండ్రి రెండవ వివాహం చేసుకున్న సుభద్రమ్మ అంటే ఆయనకు ఎంతో ప్రేమ, గౌరవం.సవతి తల్లిని రాక్షసి అని తిట్టిపోసేవారిని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ తనకు తెలిసిన తల్లి ఆమే నంటాడు.


ఈ కారణాలన్నిటి వల్ల శ్రీశ్రీ సాహిత్యంలో మరీ ముఖ్యంగా మహాప్రస్థానంలో అడుగడుగునా మాతృస్పర్శ తొంగిచూస్తుంది. ఒక విధంగా ఇది మాగ్జిం గోర్కి పాత సమాజాన్ని అమ్మగా చిత్రించడం వంటిదే. అలాగే శ్రీశ్రీ కూడా కవిత్వాన్ని రసధుని,మణిఖని, జననీ కవితా ఓ కవితా అని సంబోధిస్తాడు. 'నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పిననాడో' అని మరో చోట చెబుతాడు. మరో ప్రపంచం భావననే 'పుడమి తల్లికి పురిటినొప్పులు' అని కొత్త ప్రపంచం కోసం జరిగే పోరాటాన్ని అభివర్ణిస్తాడు. నడిరే నిద్దురలో అపుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకొని రుచిర స్వప్నాలను గాంచే జవరాలి మన:ప్రపంచపు టావర్తం' అంటాడు. బాటసారి గేయంలో అతన్ని గురించి చెప్పిన ప్రతిసారి పల్లెటూళ్లో తల్లిని కూడా సమాంతరంగా వర్ణిస్తూ ఒక కరుణార్ద్రరస చలన చిత్రం చూస్తున్న అనుభూతి కలిగిస్తాడు.
శ్రీశ్రీకి ముందు కూడా తెలుగులో ప్రజాచైతన్య స్ఫోరకమైన కవితలు, పాటలు వున్నా ఆయన వైతాళికుడు కావడానికి కారణాలు అనేకం. స్వతహాగా మహా ప్రతిభావంతుడు. ఆపైన సాహిత్యసంప్రదాయాలున్న కుటుంబం. ఏది అడిగినా అందించే తండ్రి. ఆ విధంగా బాల్యంలోనే సాహిత్య సంపర్కం కలిగింది. నాటకాలలోనూ వేషాలు వేశాడు. చిన్నప్పుడే నవల రాశాడు. చిత్రకళ అభ్యసించాడు. సంప్రదాయ కవిత్వంలో మునిగితేలి సామ్యవాదం వైపు నడిచాడు. ఆ క్రమంలో దేశ దేశాలకు చెందిన అత్యాధునిక కవిత్వ పోకడలను ఆకళింపు చేసుకున్నాడు. మొదట సకల సంపదలూ అనుభవించిన కుటుంబం దారిద్య్రంలో కూరుకుపోవడం వల్లనూ. తీవ్రమైన అనారోగ్యం వల్లనూ ఆయన జీవితపు ఆటుపోట్లు అనుభవించాడు. ఈ అంశాలన్ని కలగలసి ఆయన అనుకున్న భావాన్ని సరికొత్తరీతిలో అక్షరీకరించగల శబ్దబ్రహ్మగా అవతరించాడు. తనకు ముందున్న వారికి లేని విశిష్టతను, విలక్షణతను సంతరించుకోగలిగాడు.
శ్రీశ్రీ 1918లోనే ఒక కంద పద్యం, 'గోకులాయి' అనే డిటెక్టివ్‌ నవల రాశాడు.1920లో 'వీర నరసింహరాయలు' అనే నవల రాశాడు. 1922లో 'సావిత్రీ సత్యవంతులు' పద్య నాటకం రాశాడు. 1924లో ఆయన నవల 'పరిణయ రహస్యం' అచ్చయింది. అదే ఏడాది ఆయన ఎంతగానో ప్రేమించే పినతల్లి సుభద్రమ్మ మరణించారు. కుటుంబాన్ని దారిద్య్రం చుట్టు ముట్టింది కూడా అప్పుడే.మరుసటి ఏడాది అంటే పదిహేనో ఆయనకు వెంకటరమణమ్మతో పెళ్లి జరిగింది.అది కూడా చాలా హడావుడిగానూ గందరగోళంగానూ జరిగింది.
శ్రీశ్రీకి మొదటి నుంచి సాహిత్య సృజనకే పరిమితం కాకుండా సాహిత్యమిత్రులతో కలసి సాహిత్య సంఘాలు ఏర్పర్చడం కూడా చాలా ఇష్టమైన పని. ఆయన పురిపండా అప్పలస్వామితో కలసి 1926లో కవితా సమితి స్థాపించారు.1928లోనే ఆయన తొలి ఖండ కావ్యం ప్రభవ అచ్చయింది. అందులో సంప్రదాయ ముద్రతో పాటు కొత్తదనపు ఛాయలూ ప్రస్ఫుటమయ్యాయి.1928-30 మధ్య మద్రాసులో బిఎ చదువుతున్నప్పుడే ఆయనకు కొంపెల్ల జనార్థనరావుతో సహా అనేక మంది సాహితీ మిత్రులు, ప్రముఖుల పరిచయం కలిగింది.1929లో సుప్తాస్తికలు(నిద్రించే ఎముకలు) గీతంలోనే తొలిసారి పీడితుల వేదనా స్వరాలు వినిపించడం మొదలైంది.
1930లో శ్రీశ్రీ 63 రోజులపాటు టైఫాయిడ్‌ తో పెనుగులాడాడు. అది ఆయనను శారీరకంగానే గాక మానసికంగానూ చాలా ఘర్షణకు గురి చేసింది.కొత్త భావాలకు అంకురార్పణ జరిగింది. 1931-33 మధ్య ఏవిఎస్‌ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగం చేస్తూనే సాహిత్యం విస్త్రతంగా అధ్యయనం చేశాడు. అప్పటి వరకూ తనను అమితంగా ప్రభావితం చేసిన దేవుల పల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణల వరవడి నుంచి బయటపడ్డాడు. 1933లో 'జయభేరి' గీతంతో మహాప్రస్థానానికి నాంది పలికాడు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను' అంటూ మొదలయ్యే ఈ గీతం సమాజానికి వ్యక్తికి మధ్య వుండవలసిన సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. పైగా ఈ వాక్యం ద్వారా ఆయన కేవలం అగ్రవర్ణాల వారే గాక ఎవరైనా హోమానికి సమిధ కావచ్చన్న భావనను ప్రవేశపెట్టాడు. ఈ గీతం మూడు భాగాలుగా వుంటుంది. మొదట గతం, రెండవది వర్తమానం, మూడవది భవిష్యత్తు... 'నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను' అంటూ ముగించడం 'సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అన్న దానికి భిన్నంగా ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గీతంలోనే శ్రీశ్రీ తొలిసారి 'గబ్బిలం' ప్రస్తావన కూడా చేశాడు. ఉత్తరోత్తరా జాషువా 'గబ్బిలం'పైనే కావ్యం రాశాడు.
మహాప్రస్థానంలో గేయాలన్ని జన ప్రియమైనవే. వాటి చూపూ వూపూ రూపూ లోతుపాతులు చాలా విధాలుగా విశ్లేషించుకున్నవే. పతితులూ భ్రష్టులను ఏడవకండని భరోసా ఇచ్చి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయని ధైర్యం చెప్పి 'పదండి ముందుకు' అంటూ కదం తొక్కించి కనబడలేదా ఎర్రబావుటా నిగనిగలు చూపించిన 'మహా ప్రస్థానం' తెలుగు భాషా సాహిత్యాలను కొత్త మలుపు తిప్పింది. అర్థాలూ పరమార్థాలూ మార్చేసింది. దగా పడిన తమ్ముడు, కదం తొక్కుతూ పదం పాడుతూ, కాదేదీ కవిత కనర్హం,కదిలేదీ కదిలించేదీ, ప్రపంచమొక పద్మవ్యూహం, ఆ పాపం ఎవ్వరిది, ఏమున్నది గర్వకారణం, దాచేస్తే దాగని సత్యం, ఇతిహాసపు చీకటి కోణం, ఇంకానా ఇకపై చెల్లదు, ఉరితీయబడిన శిరస్సు, ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన .. ఇత్యాది ఎన్నెన్నో పదబంధాలను అందించింది. పదాలకు అర్థం మార్చింది. శ్రీశ్రీని శబ్దబ్రహ్మను చేసింది.
అయితే ఈ దశకు చేరడానికి శ్రీశ్రీ నిజంగానే మహాప్రస్థానం చేశాడు. తనకు స్ఫూర్తి నిచ్చిన కృష్ణశాస్త్రి, విశ్వనాథ వంటివారిని భావ పరంగానే గాక ప్రసిద్ధిలోనూ అధిగమించాడు. కారణం ఆయన ప్రజలతో ప్రగతితో నిలబడ్డమే. చివరకు కృష్ణశాస్త్రి కూడా ఈ ప్రభావాన్ని తప్పించుకోలేక తన వూహా ప్రేయసి కోసం ఏడ్చే తన సహజ శైలిని పక్కన పెట్టి 'ఆకాశము నుదుట పొడుచు అరుణారుణ తార' అని రాయవలసి వచ్చింది. విశ్వనాథ తిరోగమన భావాలను శ్రీశ్రీ పదే పదే విమర్శిస్తున్నా ఈయన 'కవితా ఓ కవితా' లోని కవిత్వ సాంద్రతకు కదలిపోయిన విశ్వనాథ అక్షరాలా ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇవన్నీ శ్రీశ్రీ ప్రతిభను చెబుతాయి. స్విన్‌బర్న్‌,ఎడ్డార్‌ ఎలెన్‌ పో తదిరత అనేక మంది పాశ్చాత్య కవులనూ ఆయన అంతే పట్టుగా చదివాడు. ఆ దేశాలకు వెళ్లినపుడు వారి కవితలు వారి ముందే తుచ తప్పకుండా అప్పజెప్పి ఆశ్చర్య పర్చాడు.
మహాప్రస్తాన గీతాలు మొదట్లో ఆదరణ పొందలేదు. సావిత్రిని నటిగా పనికిరావని తిరస్కరించినట్టే శ్రీశ్రీ గీతాలను కూడా అప్పటి ప్రముఖ సాహిత్య పత్రికలు వెనక్కు పంపించాయి! అయితే అచ్చయిన తర్వాత మాత్రం అవి గొప్ప సంచలనం కలిగించాయి.పుస్తకంగా అచ్చు వేసుకునే శక్తి శ్రీశ్రీకి లేకపోవడంతో దాదాపు పదిహేనేళ్లు పట్టింది.అప్పుడు కూడా నళినీ కుమార్‌ అనే మిత్రుడు దాన్ని తీసుకొచ్చాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు ప్రచురణ సంస్థగా విశాలాంధ్ర దాన్ని తీసుకువస్తున్నది.
శ్రీశ్రీ అంటే 'మహాప్రస్థానం' గుర్తుకు వస్తుంది గాని నిజానికి ఆయన విస్తృత రచనా వ్యాసంగం అనేక రూపాల్లో కొనసాగిస్తూనే వచ్చాడు. అవి ఇరవై సంపుటాలుగా విరసం ప్రచురించింది. వాటిలో వ్యాసాలు కవిత్వం కన్నా ఏమాత్రం తీసిపోని శైలితో కదం తొక్కిస్తాయి. వ్యంగ్య ప్రయోగాల్లో ఆయన అందె వేసిన చేయి. తర్వాత కాలంలో ఈ ధోరణిలోనే 'మూడు యాభయిలు' రాశాడు.
శ్రీశ్రీ కవి మాత్రమే కాదు. జర్నలిస్టు కూడా.ఆంధ్రప్రభ,ఆనంద వాణి వంటి పత్రికల్లో ఉద్యోగం చేశాడు. కమ్యూనిస్టు పత్రికలను నిరంతరం ప్రోత్సహిస్తూ రచనలు అందిస్తూ వచ్చారు. ఇవే గాక జీవితంలో మధ్య మధ్య ఇంకా అనేక వుద్యోగాలు చేశాడు.
శ్రీశ్రీ సినిమా జీవితం కూడా చాలా సుదీర్ఘమైంది.1949లో 'ఆహుతి'తో అది ప్రారంభమైంది. 'పాడవోయి భారతీయుడా, తెలుగు వీర లేవరా' వంటి సినిమా పాటలు అందరం చెప్పుకుంటారు. కాని ఆయన ప్రధానంగా అనువాద చిత్రాల్లో పనిచేశారు. డబ్బింగ్‌ సామ్రాట్‌ అనిపించుకున్నారు. ఆ డబ్బింగ్‌ ప్రక్రియలో తనకు సహాయకురాలిగా వున్న సరోజనే 1955లో రెండవ పెళ్లి చేసుకున్నారు. సంతానం కన్నారు. (మొదటి భార్య వెంకటరమణమ్మ 1973లో చనిపోయారు.) తమిళ భాషతో పరిచయమే కాక పెదవుల కదలికకు అనుగుణంగా తెలుగు పదాలు రాయగలిగిన సామర్థ్యం ఆయనకు మెండు. సినిమా పాటలకు సామాజిక చైతన్యం, వర్గ చైతన్యం సమకూర్చిన వారిలో ఆయన అగ్రగణ్యుడు. ఇదేగాక తెర వెనక కూడా సినిమాలకు సమాచారం అందించడంలోనూ, సంవిధానాన్ని సూచించడంలోనూ ఆయన చాలామందికి సహాయపడ్డారు. రచయిత అయినప్పటికీ రాబోయే కాలం సినిమా మీడియాదేనని నమ్మి దానిపై విస్తారంగా రాశారు.
మహాకవి స్థానం అలంకరించి కూడా కష్టభూయిష్టమైన కమ్యూనిస్టు ఉద్యమంతో కలసి నడిచిన ఆశయ నిబద్ధత శ్రీశ్రీది. ఈ విషయంలో ఆయనతో పోల్చదగిన వారు మరొకరు కనిపించరు. 1955లో హోరాహోరీగా జరిగిన మధ్యంతర ఎన్నికల రణరంగంలో శత్రు శక్తుల దుష్ప్రచారాన్నే గాక దాడులకు కూడా గురయ్యారు. మతిస్థిమితం పాలై మళ్లీ నిలదొక్కుకుని మహాప్రస్థానం కొనసాగించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాల తర్వాత కూడా ఆయన ఎర్రజండానే అంటిపెట్టుకుని వున్నారు. అరసం విరసం రెండింటిలోనూ కీలక పాత్ర వహించారు.
సోషలిస్టు దేశాలలో విస్తృతంగా పర్యటించారు. సోవియట్‌ అవార్డు అందుకున్నారు. చైనా వెళ్లి చాలా ఉత్సాహపడి వచ్చారు.
శ్రీశ్రీ పట్ల యువతరంలోనూ చాలా ఆకర్షణ వుండేది. ఆయన ప్రేరణతోనే చాలా మంది కవులయ్యారు. కాలేజీ డేలకు అతిథిగా హాజరైతే జనం విరగబడి వచ్చేవారు. పెద్ద ఉపన్యాసకుడు కాదు కాని ఈ పర్యటనలతోనూ రచనలతోనూ ఆయన సాహిత్య చైతన్యం పెంచారు. తన తర్వాత వచ్చిన ప్రగతిశీల కవులను గొప్పగా ప్రోత్సహించడం ఆయనలో ప్రత్యేకత.వారిని ఉదారంగా ప్రశంసిస్తాడు.
మాటల్లో విరుపూ మెరుపూ శ్రీశ్రీ సొంతం. ఆయన పేరుతో అనేక చమత్కారాలు హాస్యాలు సాహిత్య లోకంలో స్థిరపడిపోయాయి. ప్రశ్నలు జవాబుల కింద చేసిన చమత్కారాలు గాని, ప్రాస క్రీడలు గాని బాగా ప్రసిద్ధి.
శ్రీశ్రీ స్నేహితులను అమితంగా ప్రేమించాడు. కీర్తిశేషుడైన కొంపెల్ల జనార్థనరావుకు తన మహాప్రస్థానం అంకితం ఇవ్వాలని మొదటే నిర్ణయించుకున్నాడు.
చాలామంది కవులు కళాకారుల లాగే మద్యపాన వ్యసనం వున్న శ్రీశ్రీ దానివల్ల ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చాలా నష్టపోయాడు. అయితే జీవితం చివరి దశలో వైద్యుల సలహా మేరకు దానికి పూర్తి దూరంగా వుండిపోయారు. ఆర్థికంగా అనేక కష్టాలు పడినా మేధస్సును పాలకవర్గాలకు తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదు. చివరకు 1983 జూన్‌ 15న కన్నుమూశారు. కాని లాభం లేదు నేస్తం నీ ప్రాభవం మమ్ముల్ను వదలిపెట్టడం లేదు, నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లే నేర్చుకున్నాము అని కొంపెల్ల జనార్థనరావును ఉద్దేశించి ఆయన అన్నట్టే శ్రీశ్రీ ప్రభావం ప్రేరణ కొనసాగుతూనే వున్నాయి. చలం చెప్పినట్టు మరో ప్రపంచ నిర్మాణం కోసం సాగిపోయే వారికి ఆయన కవిత్వం మార్చింగ్‌ బాండ్‌లాగా చిరస్మరణీయమై నిల్చిపోయింది.