వీలుంటే నా నాలుగు లంకెలు ...

23, జులై 2009, గురువారం

దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి?

8 వ్యాఖ్యలు
దేవుడు ఉన్నాడని కొందరు అంటారు. లేడని కొందరు అంటారు. ఇంతకూ దేవుడు ఉన్నాడా? లేడా? లేడనుకుంటే మనుషులకు పూనకాలు ఎందుకు వస్తున్నాయి? పూనకాలు వచ్చినవారు కేవలం నటిస్తున్నారా?
- డి.కార్తీక్‌, 9వ తరగతి, బాలభారతి పాఠశాల, ఆదిలాబాదు.


'దేవుడి'ని నమ్మేవారే వివిధ రకాలుగా భాష్యం చెబుతారు. ఈ విశ్వం మొత్తంలో ఉన్న క్రమానుగతినే మనం 'దేవుడు' అంటాము - అని కొందరంటారు. 'క్రమాను గతి' తెలుగు వ్యాకరణం ప్రకారం 'నపుంసకలింగా'నికి సంబంధించిన పదం. కాబట్టి 'దేవుడు' అంటూ పుంలింగాన్ని ఆపాదించకుండా 'దైవం' అని ఆ క్రమానుగతిని వారు పేర్కొంటే ప్రపంచంలో ఎవరికీ అభ్యంతరంలేదు. విశ్వంలో క్రమానుగతి తప్పకుండా ఉంది. 'దైవం' అనే పదం ఆ క్రమానుగతికి మరో పర్యాయపదం అని మనమూ, ప్రపంచంలోని అందరూ సర్దుకుపోగలము. ఈ విషయంలో కరుడుగట్టిన నాస్తికవాదులకు కూడా అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.
మానవజాతికి, ఇతర జీవజాతులకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే మానవుడే ఆలోచిస్తాడు. క్రమమేమిటో, అక్రమమేమిటో గుర్తిస్తాడు. సాధారణ విషయాలేవో, అసాధారణ విషయాలేవో పసిగడతాడు. తన ప్రాణానికి, తనతోటి బృందపు సంక్షేమానికి ప్రమాదం వాటిల్లినపుడు ప్రమాదం కల్గించే అంశాలనే మార్చి ప్రమాదరహితంగా రూపొందిస్తాడు. ఆ క్రమంలో తనకర్థంగాని వాటిపట్ల, అసాధారణ విషయాలైన గ్రహణాలు, తోకచుక్కలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, తుపానులు, ఇంద్రధనస్సులు, ఉరుములు, మెరుపులు వంటి అరుదైన సంఘటనలపట్ల విస్మయము, సంభ్రమము, భయాందోళనలు చెందేవాడు. ప్రతి మానవ కార్యక్రమంలో మనిషి ప్రయత్నపూర్వక హస్తమున్నట్లే ఇలా అరుదుగా సంభవించే సంఘటనల పట్ల కూడా ఎవరో మానవాతీతవ్యక్తి లేదా శక్తి ప్రమేయం ఉండవచ్చునని ఊహించాడు. ప్రజల్లో సహజంగా ఉండే ఇలాంటి సందిగ్ధతను, సందేహాలను, 'దేవుడు', 'దయ్యం', 'పూజలు', సంతుష్టిపరిచే 'పబ్బాలు', 'మొక్కులు', 'బలులు', 'అప్పగింతలు', 'త్యాగాలు', 'ఆలయ నిర్మాణాలు', అనే తంతుతో పాలకవర్గాలు మొగ్గలోనే తుంచి అక్కడికక్కడ సర్దిచెప్పేవి. ఈ విధమైన తాత్కాలిక ఉపశమనంతో సర్దిచెప్పడం వల్ల ప్రజల హేతువాద దృక్పథం, తార్కిక విశ్లేషణ, సంపూర్ణ సత్యాన్వేషణాసక్తి రాటుదేలేవి కావు. క్రమేపీ 'దేవుడు', 'దయ్యం' భావాలు ప్రజల్లో ఉంటే పాలకవర్గాలకు మరింత ఊతంగా ఉండేలా సంస్కృతి, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితులు నెలకొన్నాయి. గత చరిత్ర అంతా ఈ విధంగానే నడిచింది. మానవజాతిలో ఏర్పడిన భౌగోళిక, భాషా పరిణామాలకు అనుగుణంగానే 'దేవుడు' అనే భావనలు, రూపాలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, స్వరూపాలు మారుతూ వచ్చాయి. మానవాతీతశక్తులు, ఏది కావాలంటే అది చేయగల మహా మహా అద్భుత కార్యకలాపాలు 'దేవుడి'కి ఆపాదించడం జరిగింది. 'దేవుడు' పాలకులకు మొదటి మిత్రుడయ్యాడు. పాలితులకు సర్దిచెప్పే సలహాదారుడయ్యాడు. యథాతథ సమాజ రూపానికి దన్నుగా నిలిచాడు. మార్పు అవసరంలేని పరిస్థితికి ఆలంబనగా తోడయ్యాడు. మనిషి ఎదుర్కొనే ప్రతి కష్టానికి, సుఖానికి, దుఃఖానికి కారణ భూతుడయ్యేలా అదే మనిషి నమ్మే పరిస్థితికి చేరుకున్నాడు.

శక్తి సామర్థ్యాలు, రూపురేఖలు, జన్మ వృత్తాంతాలు ఆయా సమాజాల్లోని మానవ సమూహాల అభిరు చుల కనుగుణంగా 'దేవుడు', 'దైవభావన' రావడం వల్ల దేవుళ్ళు చాలామందయ్యారు. అది ఏ మానవ సమూహమైనా, వర్గ సమాజంగా ఉన్నంతవరకు ఆ దేవుడి రూపురేఖలు, ఇతర శక్తియుక్తులు, ప్రతిభలు వేర్వేరుగా ఉన్నా ఆయావర్గ సమాజాల్లో పాలకవర్గానికి బలాన్ని చేకూర్చే దేవుళ్ళుగానే వర్ధిల్లారు. వివిధ సంస్కృతులు, అలవాట్లు, భాషలు, దైవభావనలు ఉన్న మానవులు సార్వత్రిక సమస్యల పట్ల ఐక్యమవుతున్న సందర్భాలలో అదే పాలకవర్గాలు ఆయా జాతులకు అత్యంత ప్రీతిపాత్రమైన వారి వారి దేవుళ్ల భావాల మధ్య అనైక్యతను సృష్టించేవారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేవారు. నేటికీ ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో ఇతర దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. మనిషి కష్టాలకు కారణాలు వర్తమాన ప్రపంచంలోనే, నిజజీవితంలోనే ఉన్నాయనీ, ఆ కష్టాల నివృత్తికి సమిష్టిగా పరిష్కారమార్గాలను అన్వేషించాలనీ మానవులందరూ తెలుసుకున్న రోజు 'దేవుడి' భావన ప్రజలకు అవసరం ఉండదు.

పేదరికం, దుఃఖం, వేదన, అనారోగ్యం, ఆకలి, దప్పిక, అవిద్య, క్రూరత్వం, అమానుషత్వం ప్రకృతిలో సహజమైనవి కావు. అవి ప్రకృతిలోని క్రమత్వానికి సాక్ష్యాలు కానేకావు. క్రమత్వానికి, సర్వశక్తి సంపన్నతకు ఆలవాలమైన దేవుణ్ణి నమ్మే ప్రతి సామాజికవర్గం తమ వేదనల్ని, కష్టాల్ని పోగొట్టమని వేడుకోని రోజు ఉండదు. కొన్నివేల సంవత్సరాలుగా ఆ దేవుణ్ణి పేరు పేరునా ప్రార్థిస్తున్నారు. పదే పదే పూజలు చేస్తున్నారు. కానీ వేదనలు, నొప్పులు, అకాలమరణాలు, క్రూరమైన సంఘటనలు, కష్టాలు, దుఃఖాలు మెజారిటీ మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి. గత జన్మ పాపులుగా వారికో స్టిక్కరేసి 'మీ ఖర్మ ఇంతే' అని వారిని గిరాటేస్తున్నారు. 'చేసేది, చేయించేది, నడిపేది, నడిపించేది, కదిలేది, కదిలించేది, బాధపడేది, బాధపెట్టించేది, దుఃఖించేది, దుఃఖాన్ని కల్గించేది ఆ దేవుడేనని కష్టాల బయటున్న వారు అంటుంటే అర్థంచేసుకోలేని దయనీయపుటజ్ఞానపు మత్తులో ప్రజలుంటున్నారు. వేదన, మనోవేదన రెండింటినీ భరించేకంటే తాత్కాలిక ఉపశమనంగా మనోవేదనను మరిపించేలా విషపూరితం కాని మత్తు ద్రవ్యంగా 'దేవుడి భావన', 'దేవుడి దయ', 'దైవేచ్ఛ', 'దేవుడి లీలలు' వంటి భావజాలాలు ఉపకరిస్తున్నాయి.

క్రమత్వానికి ఆపాదించబడిన దైవభావన కేవలం ఊహలకే పరిమితమయిపోయింది. కోరికలు తీర్చేవాడిగానూ, దుష్టులని కొందరిని తయారుచేసి వారిచేత దుష్టకార్యక్రమాలను తానే చేయించి ఆ బాధలు పడేవారిని తానే తన దగ్గరకు 'దేవా రక్షించు' అని రప్పించుకొని మళ్లీ తానే దుష్ట సంహారం చేసే అర్థంగాని మనసున్నవాడిగానూ దేవుడు కీర్తించబడుతున్నాడు. పూజలు అందుకుంటున్నాడు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలకు కనిపించని బంధువు అయ్యాడు.

'దేవుడు ఉన్నాడా?' 'లేడా?' అన్న ప్రశ్నకు సమాధానం వెదికి తలబద్దలు కొట్టుకొనేకన్నా మనిషే మానవ చరిత్రను నడిపాడనీ, మనిషే దేవాలయాలను నిర్మించాడనీ, మనిషే విగ్రహాలను రూపొందించాడనీ, మనిషే పురాణ గ్రంథాల్ని రచించాడనీ, మనిషి అప్రమత్తంగానే శ్రమద్వారా, ప్రయత్న పూర్వకంగా చేసిన కార్యక్రమాలే మానవ జీవితాన్నీ, నాగరికతనీ, సంస్కృతినీ, వేదాంతాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ రూపొందించాయన్న తిరుగులేని సత్యాన్ని అందరం నమ్ముదాము.

దేవుడి మీద నమ్మకానికీ, పూనకాలకూ సంబంధం ప్రత్యక్షంగా ఏమీ లేదు. నువ్వన్నట్లు చాలా మంది పూనకందార్లు ఏదారీ లేక పూనకపు దార్లు తొక్కుతున్నారు. హిస్టీరియా జబ్బుతో కొందరు, బాధలు వెళ్లగక్కుకోవడానికి మరికొందరు పూనకాలను పూనుకుంటున్నారు.

విజ్ఞానశాస్త్రంపై మతదాడి-1

72 వ్యాఖ్యలు

ప్రాచీనకాలంలోనే భారతదేశం విజ్ఞానశాస్త్రానికి నిలయమైంది. ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి అనేక మహత్తర పరిశోధనా ఫలితాలను అందించారు. శాస్త్రాలకే మూలశాస్త్రంగా ఉన్న గణితశాస్త్రంలో 'సున్నా'ను అందించిన ఘనత మనవారిదే. అన్ని ఆకుల ఔషధ గుణాలను ఔపోశనపట్టిన చెరకుడు మన ప్రాచీన వైద్యశిఖామణి. భూమి - చంద్రుల వ్యాసార్థలను, గ్రహాల చలనాల ద్వారా వచ్చే గ్రహణాలను లెక్కించిన ఖగోళ శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మనవారే. విజ్ఞానశాస్త్ర పరిశోధనల కారణంగా మన భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు. వారందరూ భారతీయ శాస్త్రవేత్తలను ఆచార్యులుగా అంగీకరించారు. అదే సమయంలో మతనాయకులు దురదృష్టవశాత్తుగా ఆ శాస్త్రవేత్తలపై తీవ్ర దాడి చేసి, వారి నోటితోనే 'విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాల'కంటే మతనాయకుల 'ప్రవచనాలు' సరైనవని చెప్పించారు. దీన్ని ధృవపరచుకోడానికి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఆచార్య చెరకుడు వైద్య శాస్త్రంలో నిష్ణాతుడు. ఈయన 'చెరకు సంహిత' అనే వైద్య శాస్త్ర మహాగ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథం ప్రథమ భాగంలోనే ఇలా అంటాడు. 'శరీర ధర్మాలను మాత్రమే కాక, ప్రతిభ, తెలివితేటలు కూడా ఆహారం నుంచే వస్తాయి (చెరకు సంహిత 80వ పేజీ). ఇంకొంచెం ముందుకు వెళ్లి వైద్యశాస్త్రం యొక్క ప్రాధాన్యతలను ఇలా వివరిస్తాడు. ''పదార్థానికి సంబంధించిన వివిధ రకాల జ్ఞానం మాత్రమే వైద్యశాస్త్రానికి అవసరం. చికిత్సా విధానంలో పదార్థాన్ని దాటిపోవడాన్ని ఊహించలేం'' (చెరకు సంహిత 174వ పేజీ). వివిధ రోగాల చికిత్సకు ఏఏ పదార్థాలు వాడాలో గ్రంథంలో వివరించారు. ఉదాహరణకు వివిధ రోగాలకు, ఆవుకు సంబంధించిన పదార్థాలు ఎలా వాడాలో వివరించారు. ''గోమాంసంతో తయారుచేసిన పులుసును వరుస తప్పి వచ్చే జ్వరానికి, క్షయకు, నీరసానికి మందుగా ఉపయోగించాలి. ఆవు కొవ్వును బలహీనతకు, కీళ్లవాతానికి మందుగా వాడాలి. ఆవు మాంసాన్ని పొగవేస్తే శ్వాసకోశ వ్యాధులు, ఆవు కొమ్ముల్ని కాల్చి, ఆ గాలిని పీలిస్తే కఫ రోగాలు పోతాయి'' అని తెలిపారు (పై గ్రంథం 186-187 పేజీలు). చికిత్సా విధానానికి పదార్థానికి గల సంబంధాన్ని గూర్చి ప్రథమంలోనే ఇంతగా వివరించిన ఆ మహా వైద్యులు ఆ తర్వాత భాగంలో రోగాలకు అధిభౌతిక కారణాలు ఉంటాయని, వాటి చికిత్సకు పదార్థం అవసరం లేదని అంటాడు. ఉదా: ''కుష్టు రోగానికి కారణాలు ఏమిటి?'' అని ప్రశ్నించి... ''దైవ ద్రోహం, పాపకార్యాలు చేయడం. గత జన్మలోని పాపాలు కుష్టురోగానికి కారణాలు.' అని పేర్కొంటాడు. (పై గ్రంథం 298వ పేజీ). 'దీనికి చికిత్స ఏమిటి?'' అని ప్రశ్నించి.. ''దేవతలు, దేవదూతలను సేవించి, ఈశ్వరుడు, అతని భార్య ఉమను భక్తితో పూజించడం అని సమాధానం ఇస్తాడు'' (అదే పుస్తకం 298 పేజీ). (మిగతా తదుపరి టపాలో http://vasavya.blogspot.com/2009/07/1.html )

22, జులై 2009, బుధవారం

భారత్‌-అమెరికా ఉమ్మడి ప్రకటన హానికరం

1 వ్యాఖ్యలు
అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటన అనంతరం భారత్‌-అమెరికా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరచాలని కోరుతోంది. '21వ శతాబ్దంలో ప్రపంచ సౌభాగ్యాన్ని, సుస్థిరతను పెంపొందించేందుకు' సంబంధాల్లో మార్పులు రావాలంటూ గొప్పగా మాట్లాడినప్పటికీ అందులోని అంశాలు, కుదుర్చుకొన్న ఒప్పందాలు నిజంగా భారత ప్రయోజనాలకేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అమెరికా పరికరాల తుది వినియోగ నియంత్రణపై ఉభయ పక్షాలూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. అలాంటి ఒప్పందం అమెరికా సరఫరా చేసే పరికరాలను ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని తనిఖీ చేసేందుకు వీలుకల్పిస్తుంది. భారత్‌తో పెరుగుతున్న సైనిక సహకారం అమెరికా ప్రయోజనాలకు కీలకమైంది. భారత్‌ వందల కోట్ల డాటర్ల సైనిక పరికరాలు కొనుగోలు చేయాలని అది భావిస్తోంది. తుది వినియోగ నియంత్రణ ఒప్పందం అనేది 'అణు సహకార రంగంలో భారత్‌, అమెరికా సంతకాలు చేసి ఒప్పందంలో చేపట్టాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం' అని హిల్లరీ భారత పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి ఫిలిప్‌ జె క్రాలే పత్రికలకు తెలిపారు. అణు ఒప్పందం భారత్‌ను అమెరికాకు జూనియర్‌ భాగస్వామిని చేస్తుందని, ఒప్పందంలోని నిబంధనలు సైనికంగా భారత్‌ను అమెరికాకు కట్టుబడేట్లు చేస్తాయి.
తుది వినియోగ నియం త్రణ ఒప్పందం భారత సైనిక దళాలు పెంటగాన్‌కు మరింతగా లోబడి ఉండేలా చేస్తుంది. భారత్‌-అమెరికా అణు ఒప్పందంతో దానికి సంబంధం లేదని హిల్లరీ చెబుతున్నప్పటికీ భారత్‌కు అణుశుద్ధి, రీప్రాసెసింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకుండా చేసే దిశగానే అమెరికా కదులుతోంది.
ఇటీవలి జి-8 నిర్ణయం దీన్నే ధృవీకరించింది. ఇంకా అమెరికా సరఫరా చేసే వినియోగించిన ఇంధన సరఫరా ఒప్పందాన్ని భారత్‌ చేసుకోవలసి ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం గతంలో 10 వేల మెగావాట్ల అణు రియాక్టర్లు కొనుగోలు చేస్తానని వాగ్దానం చేసింది. ఈ అణు ఒప్పందాన్ని ప్రపంచ అణు వ్యాప్తి నియంత్రణ పరిధిలోకి తేవాలని అమెరికా భావిస్తోంది. ఈ అంశాలన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకూ అమెరికా అణు రియాక్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోరాదని సిపిఎం పునరుద్ఘాటించింది. భారత విధాన నిర్ణయాల్లో అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఉండాలని ఆ ఉమ్మడి ప్రకటన స్పష్టంగా తెలిపింది. దీన్ని ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంలోనూ, భారత్‌-అమెరికా ఉమ్మడి సిఇఓ వేదికలోనూ రూపొందించబోతున్నారు. ఈ లాబీయింగ్‌ వేదికలకు అనుగుణంగానే ఇన్సూరెన్స్‌, బ్యాంకింగ్‌, ఉన్నత విద్య, తదితర రంగాల్లోకి ఎఫ్‌డిఐని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం మరింతగా అనుమతించబోతోంది. అదే సమయంలో ఇరాన్‌ పట్ల శత్రు వైఖరిని చేపట్టాలని అమెరికా విదేశాంగ మంత్రి ఒత్తిడి తేవడం జరిగింది. ఇరాన్‌తో గ్యాస్‌ పైప్‌లైన్‌ ఒప్పందాన్ని పక్కకు పెట్టడంతో ఇరాన్‌ను మరింతగా ఒంటరిపాటు చేయాలని అమెరికా కోరుకుంటోంది. అలాంటి ఒత్తిళ్ళను ప్రతిఘటించాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. డబ్ల్యుటిఓపై దోహా విడల చర్చలను ప్రస్తావిస్తూ వ్యవసాయం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై భారత్‌ తన వైఖరిని విడనాడాలనే ఒత్తిళ్ళకు తలొగ్గరాదు. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి అభివృద్ధి చెందిన దేశాలు ఏమీ తీవ్ర చర్యలు తీసుకోకుండానే భారత్‌ను తగ్గించాలంటున్న వాతావరణ మార్పు చర్చల్లో అమెరికా డిమాండ్‌ను అంగీకరించరాదు. ఈ ఏకపక్ష సంబంధాన్ని పటిష్టపరిచేందుకు తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకించాల్సింది



9, జులై 2009, గురువారం

ప్రణబ్‌ బడ్జెట్‌ అసలు రంగు

2 వ్యాఖ్యలు
వాస్తవం ఏమంటే ఈసారి బడ్జెట్‌ తాను చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా చెప్పలేదు. వాటన్నింటికీ ముసుగు వేసింది. పైగా తన బడ్జెట్‌ అంతా సాధారణ ప్రజల కోసమే అన్నట్లుగా పోజు పెట్టింది. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి రంగాలకు, సామాజిక రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించానని చెప్పింది. దానికి మొట్టమొదటి ఉదాహరణగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది బడ్జెట్‌ కేటాయింపు కన్నా 140 శాతం అధికంగా కేటాయించినట్లు ఘనంగా చెప్పుకుంది. 2008-09 బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధి పథకానికి రు.14,400 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రు.39,100 కోట్లకు పెంచారు. ఇలా చెప్పడం ప్రజలను దారుణంగా మోసం చేయడమే. ఇప్పటికే 2008-09 లో సవరించిన అంచనాల ప్రకారం రు.36,750 కోట్లు ఖర్చు పెట్టింది. దానిపై అదనంగా కేటాయించింది రు.2,350 కోట్లు మాత్రమే. శాతంగా చూస్తే అది నామ మాత్రమే. పైగా దినసరి కూలి రు.80 నుండి రు.100 కి పెంపు సైతం ఈ పెంపుదలకే పరిమితమయింది.

పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఆహార భద్రత అంశంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఆహార భద్రత కోసం ఒక చట్టాన్నే తీసుకొస్తున్నట్లు బడ్జెట్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ హడావిడి చేసింది. కాని ఇప్పుడు దాని ముసాయిదా వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంది చూసి అభిప్రాయాలు చెప్పండని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ఈ ముసాయిదా చట్టరూపంలోకి ఎప్పుడు మారుతుందో, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో?

పేదరిక రేఖ దిగువన ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల చొప్పున, కేజీ రు.3కు తిండి గింజలను అందజేేయాలన్నది ఈ బిల్లు లక్ష్యమని చెబుతున్నారు. కాని ఇప్పుడు కేంద్రం పేదల్లో పేదలకు అంత్యోదయ కార్డు ద్వారా కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని కేజీ రు.2 చొప్పున ఇస్తున్నది. నూతన పథకం అమల్లోకి వస్తే ఈ అంత్యోదయ కార్డు హోల్డర్లకు కోటాను 25 కేజీలకు తగ్గిస్తారా, ధరను కేజీకి రు.3కు పెంచుతారా అన్న సందేహాలు భయపెడుతున్నాయి. పైగా అనేక రాష్ట్రాలలో పేదలకు కిలో రెండు రూపాయలు, కిలో రూపాయి బియ్యం పథకాలు అమల్లో ఉన్నాయి. కేంద్రం కొత్త పథకంతో వీటి తీరుతెన్నులు ఎలా మారతాయి అన్న విషయం కూడ అర్థం కావడం లేదు. నిజంగా ప్రజలకు ఆహార భద్రత కల్పించాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ స్థానే సార్వత్రిక ప్రజాపంపిణీని ప్రవేశపెట్టాలి. కాని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించడం లేదు.

ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి ఎంతో కొంత ఆహారాన్ని సమకూర్చేది సమగ్ర శిశుఅభివృద్ధి పథకం (ఐసిడిఎస్‌). ఇలాంటి పథకం దేశవ్యాపితంగా అందరు బాలలకు అమలు కావడం లేదు. దీన్ని సార్వజనీనం చేయాలని సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితమే ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా ఇప్పటికీ అమలు జరగలేదు. దీనికోసం కనీసం రు.12,000 కోట్లు ఏడాదికి అవసరం అవుతాయని అంచనా. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది సుమారు రు.6,000 కోట్లు మాత్రమే. అందరికీ అమలు చేయాలన్న లక్ష్యాన్ని 2012లో చేరతామని మాత్రం బడ్జెట్‌లో చెప్పారు.

విద్యారంగం పరిస్థితీ ఇదే విధంగా ఉంది. విద్యాహక్కు బిల్లు పార్లమెంటులో ఆమోదానికి సిద్ధంగా ఉంది. దీని ప్రకారం 14 ఏళ్ల లోపు బాలలందరికీ స్కూలు విద్య తప్పనిసరిగా అందించాలి. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఎలిమెంటరీ విద్యకు ఈ ఏడాది కేటాయింపులను రు.19,488 కోట్లనుండి రు.19,682 కోట్లకు మాత్రమే పెంచింది. సెకండరీ విద్యకు కొంచెం మెరుగ్గా రు.2,000 కోట్లు అదనంగా కేటాయించింది. కాని ప్రభుత్వం అసలు మోజు ఉన్నత విద్యపైనే ఉంది. దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది బేరానికి పెట్టాలని ఉబలాటపడుతున్నది. ఈ రంగానికి కేటాయింపులను రు.6,800 కోట్లనుండి, రు.9,600 కోట్లకు పెంచింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధిని బాగా పెంచాలని చెప్పిన బడ్జెట్‌, కేటాయింపులను మాత్రం ఆ విధంగా పెంచలేదు. గత బడ్జెట్‌తో పోల్చుకున్నపుడు ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెంపుదల రు.1500 కోట్లు మాత్రమే. వ్యవసాయ, సహకార రంగాలకు కలిపి ఈ బడ్జెట్‌లో రు.11,307 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రు.9,600 కోట్లు. వ్యవసాయాన్ని ఎత్తి కుదేస్తానంటున్న ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనకు కేటాయింపును రు. 2,960 కోట్ల నుండి, రు.3,241 కోట్లకు అంటే కేవలం రు.281 కోట్లు మాత్రమే పెంచింది.

రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు లాంటి పెట్టుబడులను సక్రమంగా అందించడానికి, పండిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాల్సి ఉంది. దాని గురించి ఈ ప్రభుత్వానికి పట్టినట్లు లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఉదారంగా ఇవ్వాలని మాత్రం ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు. కాని అసలు ఎలాంటి వ్యవస్థాగత రుణాలు అందని రైతులు కనీసం 40 శాతం ఉన్నారన్న సంగతి ఆయన మరచిపోయారు. రైతులకే నేరుగా ఎరువుల సబ్సిడీ అందిస్తామన్న పేరుతో ఉన్న వెసులుబాటుకే మంగళం పాడే ప్రయత్నాలు చేస్తున్నది.

పేద, సాధారణ, మధ్యతరగతి ప్రజానీకం అన్నింటికన్నా ఎక్కువ బాధపడుతున్నది అధిక ధరల తాకిడితో. ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం
ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగాయన్న పేరుతో బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందు పెట్రోలు, డీజిలు ధరలను పెంచి కూర్చుంది. పెట్రోలు, డీజిలు ధరలను అంతర్జాతీయ ధరలతో సంపూర్ణంగా అనుసంధానం చేయడం లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఇంధనం ధరలు పెరిగితే వాటి ప్రభావం మిగతా అన్ని ధరలపైనా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థ్ధిక సంక్షోభం ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. పారిశ్రామిక రంగంలో సుదీర్ఘకాలంగా ప్రతికూల అభివృద్ధి నమోదవుతున్నది. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరి సంఖ్య 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరికి ఉపాధి కల్పించడం గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించదు. ఈ ఏడాది బడ్జెట్‌ వ్యయం మొత్తం రు.10 లక్షల కోట్లు దాటినప్పటికీ, దానిలో ప్రణాళికా వ్యయం కేవలం రు. 3 లక్షల కోట్లు మాత్రమే. అంటే అత్యధిక భాగం అనుత్పాదకంగా ఖర్చవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని సైతం కాదని ద్రవ్య లోటును జిడిపిలో 6.8 శాతానికి పెంచారు. ద్రవ్యలోటు రు.4లక్షల కోట్లకు పైగానే ఉంది. ప్రణాళికా వ్యయాన్ని మించి ద్రవ్యలోటు ఉంది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో ఆదాయాన్ని సమకూర్చుకొని దాని అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టాలి. అది చాలనపుడు లోటు బడ్జెట్‌కు పాల్పడి, ఆ నిధులను ఉత్పాదకంగా ఖర్చుపెట్టవచ్చు. కాని ఇప్పుడు ప్రణాళికేతర వ్యయానికి సైతం లోటు బడ్జెట్‌పై ఆధారపడాల్సిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది.


ఉన్నత స్థాయి కార్పొరేట్‌ ఉద్యోగులు, సిఇఓలకు పన్ను పరిధిలోకి రాకుండా సమకూర్చే వేతనేతర సదుపాయాలను ఫ్రింజ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అంటారు. ఇలాంటి వాటిపై పన్ను ఎత్తివేసినా కార్పొరేట్‌ వర్గం సంతృప్తి చెందలేదు. బడాపెట్టుబడిదారులు ప్రభుత్వంపై కినుక వహించిన ప్రధాన అంశం ఒకటుంది. అది ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ఎంత మేరకు అమ్మనున్నారన్న విషయాన్ని ఈ బడ్జెట్‌లో స్పష్టంగా ప్రకటించకపోవడం. ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని సందేహానికి తావులేకుండా మరుసటి రోజు వివరించారు. ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం గురించి ప్రకటించడానికి బడ్జెట్‌ తగిన చోటు కాదని, అయినప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వం 51 శాతం వాటాలను మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా వాటిని 'ప్రజల భాగస్వామ్యం' కోసం అందుబాటులో అంటే అమ్మకానికి ఉంచుతామని ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు. బడ్జెట్లో అన్నీ ప్రకటించకూడదన్న వైఖరి వివిధ కీలక రంగాలలో ఎఫ్‌డిఐని అనుమతించడానికీ వర్తిస్తుందని భావించవచ్చు. ఎఫ్‌డిఐ ప్రస్తావనే బడ్జెట్‌లో లేకపోవడం పట్ల కొంతమంది ఆశ్చర్యం ప్రకటించారు. వాణిజ్య వర్గాలు కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గించమంటుంటే, దానికి బదులు మినిమమ్‌ అల్టర్నేట్‌ టాక్స రేటును 10 నుండి 15 శాతానికి పెంచడం పట్ల కార్పొరేట్‌ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఏం చేసినా మొత్తం ప్రత్యక్ష పన్నుల రాబడిలో నికర పెరుగుదల ఏమీ లేదని బడ్జెట్‌లో ప్రభుత్వం చూపించింది. ఆదాయపు పన్ను గరిష్ట పరిమితిని రు.2లక్షలకు పెంచాలన్నది న్యాయబద్ధమైన డిమాండు కాగా కేవలం రు.10 వేలు మాత్రం పెంచి రు.1,60,000లకు ప్రభుత్వం సరిపుచ్చింది. 2 లక్షలకు పెంచితే క్రిందిస్థాయి ఉద్యోగులు లాభపడతారు. దీనికి బదులుగా ఆదాయపు పన్నుపై అందరికీ వర్తించే సర్‌చార్జీని మాత్రం తొలగించింది. ప్రభుత్వం ప్రకటించిన మార్పుల ప్రకారం రు.2లక్షల వార్షికాదాయం లభించే వ్యక్తికి కేవలం రు.1,030 రాయితీ లభిస్తే, రు.50 లక్షల ఆదాయం వచ్చే వ్యక్తికి రు.1,45,745లు రాయితీ లభిస్తున్నది. ఆదాయపు పన్ను రేట్లలో మార్పు ద్వారా ప్రభుత్వం ఎవరిని ఆదుకోవాలనుకుంటున్నదో ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. మొత్తంగా బడ్జెట్‌ సాధారణ ప్రజలకు ఏదో ఒరగబెట్టినట్లు చూపాలని ప్రయత్నించింది. కానీ, ఆయత్నాలేవీ ఫలించలేదు. తన అసలు ఉద్దేశాలు అమలు చేయడానికి బడ్జెట్‌ సరైన చోటుకాదని ప్రభుత్వం చెప్పడం పట్ల పెట్టుబడిదారులు సంతృప్తి చెందుతారు. వారు ఆశిస్తున్న రాయితీలు తప్పక పొందుతారు. ప్రజలు మాత్రం అదనపు భారాలకు సిద్ధం కావలసి ఉంటుంది.