వీలుంటే నా నాలుగు లంకెలు ...

13, నవంబర్ 2009, శుక్రవారం

ఆంధ్రభాషావికాసం

0 వ్యాఖ్యలు
తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రానికి యాబది సంత్సరాలు నిండిన సందర్భముగా,ఆంధ్రభాషా(తెలుగు) ప్రాచుర్యంపై మా నాన్నగారు యాగాటి కనకారావు గారు 2005 సంవత్సరములో వ్రాసిన కవిత...

వేయి జిహ్వలు చాలవు నిను పొగడగ
భూమి భాషల మృదు మధుర ధ్వనుల
భారతీ ఒడిలోన మురిపెముల చిన్నారివై
తేనెలూరించు సొబగుల తెనుగు తల్లీ !


ప్రాచీన గీర్వాణ గంభీర పద బంధన
పౌరాణికేతిహాస భావనాడోల లూపిన
నన్నయాది కవి గురువుల కన్న తల్లీ
నీ సంస్కృతీ ప్రాభవాల న్నిల్పు తల్లీ !


ప్రబంధ కావ్య మదగజమన రీతుల
ప్రజాపతుల డోలలూగించి నీసౌందర్య
లహరినలరించి నీదు సంస్కృతీ నందనం
చాటిన పెద్దనాది కవులకన్న తల్లీవందనం!


నీకాటుక కంటినీరు జారు వార
విలవిలలాడి నీదు కన్నీరు తుడచి
ఓదార్చి నీ పవిత్ర ఆత్మగౌరవమ్ము
పోతనాది ప్రజా కవులకు జేజేలు !

నీదు చైతన్య స్ఫూర్తీ విజ్ణాన వీచికలు
నీతి సూత్ర ఆధునిక సంస్కరణలు
హేతు విజ్ణాన మాంధ్రుల దోచిటపోసిన
పరవస్తు కందుకూరి గురజాడలకు జోహార్లు !


పారతంత్ర్యము పారద్రోలి స్వాతంత్ర్యమ్ము
సాధించిన భరతమాత ముద్దు బిడ్డలు
పరభాషావ్యామోహాన భరత భాషల
అల క్ష్మిం చు నీదు బిడ్డల మేలుకొల్పు !


“దేశభాషలందు తెలుగులెస్స” ఘనకీర్తి
కాదు దశకోటి ఆంధ్రుల చిరకాలకోర్కె
నీదుపేర విశాలాంధ్ర కై ప్రణత్యాగమొనర్చి
భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధించిన ప్రజాకోటి
శ్రీరాముల గన్న తల్లీ నీకిదే వందనం !

ఆంధ్ర రాష్ట్రావతరణతో శ్వాస పీల్చి
ఆభ్యుదయ విప్లవ సాహిత్య ప్రక్రియలు
నీదు సామాన్య ప్రజల చైతన్య పరచిన
రాయప్రోలు దాశరధి ఆరుద్ర శ్రీశ్రీలకు జేజేలు!


శ్రీశ్రీ ఇత్యాది కవుల నీ సాహిత్య ప్రభావ

జనితా ప్రజ సాహిత్య పరవళ్ళఅతో
సమ సమాజ ధ్యేయ యువ కవితా
కిశోర్ల కన్న తెలుగు తల్లీ నీకిదే వందనం !


తెలుగు భాషా సంస్కృతి ప్రచార యాత్ర కొరకు

శుభాభినందనలతో

1942 - 2009
యాగాటి కనకారావు, ఏలూరు.

16, సెప్టెంబర్ 2009, బుధవారం

దేవుడనేవాడు నాకెదురుపడితే!!

11 వ్యాఖ్యలు

''ఓ దేవుడా! నువ్వు నన్ను డిపెం డెంటుగా సృష్టించావా? లేక ఇండిపెండెంటుగా సృష్టించావా? డిపెండెంటుగా ఐతే నేను చేసే పనులన్నిటికీ బాధ్యత నాదే. కనుక నేను సమాధానం చెప్పనక్కరలేదు. కాదూ, ఇండిపెం డెంటుగా సృష్టించానంటావూ! అలాగైతే నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? అని అడుగుతున్నాను.'' - అంటాడు గిరిశం కన్యాశుల్కం నాటకంలో. ఒక వికట హాస్య పాత్ర ధారి చేత ఈ డైలాగులు పలికించినా గురజాడ గిరీశం ద్వారా ఒక కీలకమైన ప్రశ్నను లేవ నెత్తాడు. దేవుడికీ, మనిషికీ సంబంధ ఏమిటన్నదే ఆ ప్రశ్న? భావవాదులు దేవుడే ప్రకృతిని సృష్టించాడని వాదిస్తారు. దాని నుంచి ఓ అడుగు ముందుకు పోయి దేవుని నిర్ణయాను సారమే అంతా జరుగుతుందని అని అంటారు. మరి ఆ దేవుడెలా వుంటాడు? ఎక్కడుంటాడు? ఉన్నా డని ఎలా చెప్పగలరు? అని అడిగితే దేవుడు ఆదిమధ్యాంత రహతుడని, సర్వశక్తి మంతుడని, నిరాకారుడు, నిర్గుణుడు అని సమాధానం చెప్తారు. ఏ ఆకారమూ లేని, ఏ లక్షణమూలేని దేవుడిని ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఉన్నట్టు తెలుసుకోవటం ఏలా? ''ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అని ప్రహ్లాదుడిచేత పోతన పలికిస్తాడు భాగవతంలో. వెదకి చూసినపుడు కంటికి కనపడాలంటే ఆకారం ఉండాలి. మరి దేవుడు నిరాకారుడన్నాడు కదా! ఎలా చూడటం? పోనీ ఆకారంలేకుంటేనే ఏ లక్షణమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గాలికి ఆకారం లేదు గాని మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నట్టు. విద్యుత్తుకి ఆకారంలేదు కాని టెస్టర్‌ ప్లగ్గులో పెడితే కరెంటు ఉన్నదీ పోయినదీ తెలుస్తుంది. అలా దేవుడి గురించి తెలియాలంటే ఏదో లక్షణం ఉండాలి గదా. ఏ లక్షణమూలేక, ఏ గుణమూలేక, ఏ ఆకారమూ లేక - ఇక ఉన్నట్లు భావించడమెలా? ఉన్నాడన్న విషయాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉన్నపుడు ఇక ఆ దేవుడికీ, మనిషికీ సంబంధం ఏమిటి?

దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు అన్న వాదాన్ని చీల్చి చెండాడిన వారిలో పెద్దపీట వేయాల్సినది సాంఖ్యులకు. సాంఖ్యవాదాన్ని అతి ప్రాచీనమైనదిగా చరిత్ర కారులు గుర్తిం చారు. ఉపనిషత్తుల కాలానికి ముందే సాంఖ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటిది. దానికి ముందే సాంఖ్య వాదం ఉంది. అంటే నేటికి సుమారు 2700 సంవత్సరాల క్రితమే సాంఖ్యవాదం ప్రాచుర్యం లో ఉందన్నమాట. ఈ సాంఖ్యాన్ని తొలుత ప్రతిపాదించిన వాడు కపిలుడు. ఉపనిషత్తులలో (భాందోగ్యోపనిషత్‌, కఠోపనిషత్‌, శ్వేతాశ్వతా రోపనిషత్‌, వగైరాలలో) మహాభారతంలో, భగవద్గీతలో సాంఖ్యం గురించిన ప్రస్తావనలు, చర్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల కాలంనుంచి శంకరుని వరకూ గల భావవాదులందరూ సాంఖ్యా వాదాన్ని ఖండించటానికి ఎంతో ప్రధా న్యత నిచ్చారు. దానిని బట్టి సాంఖ్యం ఆనాటికి చాలా శక్తివంతమైన భౌతికవాదంగా ప్రాచుర్యం పొందినట్టు తేలుతోంది.

సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావ వాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉన్నది. ఈ ప్రకృతికి స్వతహాగా ఉన్న స్వభావం వల్లనే నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏర్పడింది. ఇందులో దేవుని ప్రసక్తే లేదు. ఆవు గడ్డితిని నీరు తాగుతుంది. అది దాని స్వభావం. అదే సమయంలో దాని శరీర స్వభావం వలన పొదుగులో పాలు ఏర్పడ తాయి. అవుదూడ ఆ పాలను తాగుతుంది. ఇదే విధంగా ప్రకృతి స్వభావం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం నీటి స్వభావం. ఆ నీటికి ఎటువంటి చైతన్యమూ లేదు. కాని నీరు మానవులకి ఉపయోగపడుతుంది. చెట్లు, చేమలు నీటిపై ఆధారపడి బతుకుతాయి. నీటికున్న స్వభావం రీత్యానే ఇదంతా జరుగుతోంది. తప్ప వేరే ఇరత కారణం (దేవుడు) ఏదీలేదు.

దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తత్తునియలు చేసింది. దేవుడికి ఏగుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూలేని దాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగుని బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అది దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపం చం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తెలింది గదా!... ఈ విధంగా ఈశ్వర వాదు లను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది. ఈ ప్రపంచం పదార్ధమయం. పదార్ధానికి గుణాలుంటాయి. ప్రపంచాన్ని సృష్టించాడని మీరు చెబుతున్న దేవుడు నిర్గుణుడు. అంటే పదార్థరహితం. మూలకారణం పదార్ధరహితం అయితే అందులోనుంచి వచ్చిన ప్రపంచం కూడా పదార్ధరహితంగానే ఉండలి గదా. పదార్ధ రహితమైన దైవం నుంచి పదార్ధమయమైన ప్రపంచం ఎలా వస్తుంది? కార్యానికీ కారణానికీ మధ్య మూలకంగా ఉమ్మడిలక్షణం ఉండాలి. కారణంగా మీరు చెప్పే దేవుడికీ, కార్యంగా ఏర్పడిన ప్రపంచానికీ ఆ ఉమ్మడి లక్షణం ఏది? కనుక దేవుడు సృష్టికి మూల కారణం కాలేడు. తాను చెప్పిన దానిలోనే ఒకదానికొకటి పొసగకపోతే దానిని తర్కంలో స్వచోవ్యాఘాతం అంటారు. ఈశ్వరవాదం అంతా స్వవచోవ్యా ఘాతమేనని సాంఖ్యం రుజువు చేసింది.

దేవుడు సృష్టికర్తే అయితే ఎందుకోసం సృష్టించాడు? తన ఆనందం కొరకా? తన ఆనందం కోసం చేసేవాడు స్వార్ధపరుడు. దేవుడిని స్వార్ధపరుడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. కనుక దేవుడు దయతో సృష్టించివుండాలి. ఎవరిపైన ఈ దయ? నిర్జీవ పదార్దాలపై దయ అంటే అర్ధంలేదు. సజీవ పదార్ధాలపై దయ అంటారా? అలాంటి దయ కలగాలంటే ముందు సజీవ పదార్ధాలు ఉండలిగదా? జీవపదార్ధాన్ని సృష్టించాక దయ కలిగిందా లేక దయ కలిగి సృష్టించాడా? ఏది ముందు? జీవాన్ని సృష్టించ కుండానే దయ ఎలా కలిగింది?

పోనీ, దయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు కలిగింది అనుకుందాం. ఈ దయ ఎందుకోసం? జీవుల బాధలు తొలగించ డానికా? అసలు బాధలు ఎందుకొచ్చాయి? బాధలుండాలంటే శరీరం ఉండాలి. దానిని దేవుడు ముందు సృష్టించాలి. అంటే దేవుడు బాధలకు నిలయమైన శరీరాన్ని సృష్టించా డన్నమాట. అంటే బాధలకు మూలకారణం దేవుడే అన్నమాట. దీనికి ఈశ్వర వాదులు అంగీకరిస్తారా?

ముందు దేవుడు శరీరం సృష్టిస్తే అప్పుడు బాధలు కలిగాయి. బాధలను తొలగిం చాలనే దయ దేవుడికి కలిగింది. అని అను కుంటే అసలు సృష్టికి మునుపు బాధలు కలిగే ఆస్కారం లేదు అని అర్ధం అవుతుంది. అప్పుడు దయ కలగాల్సిన అవసరం లేదు. అటువం టప్పుడు సృష్టి చేయాల్సిన అవసరమే లేదు.

అబ్బెబ్బే, అలాకాదు, సృష్టి తర్వాతనే దేవుడు దయామయుడైనాడని అంటారా? అంటే ముందు ప్రాణులను సృష్టించి, వారికి బాధలు కలిగించి ఆ తర్వాత దయతో ఆ బాధలను తొలగించేందుకు దేవుడు పూనుకున్నాడని ఒప్పుకుంటారా?

ఈశ్వరవాదులు తాము చెప్పిన దానిలో దేనినీ తామే ఒప్పుకోజాలని ఇరకాటం లో పడిపోయేంతగా సాంఖ్యం తన తార్కిక వాదనలను ప్రతిభావంతంగా ప్రయోగించింది. ఇంత ప్రతిభావంతమైన ప్రాచీనమైన సాంఖ్యం తర్వాతకాలంలో బలహీనపడింది. క్రీస్తుపూర్వం నాటి సాంఖ్యవాదానికి సంబంధించి క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ రచించిన 'సాంఖ్య కారిక' 14వ శతాబ్దం నాటికి చెందిన సాంఖ్య సూత్రాలు మాత్రమే లభ్యమౌ తున్నాయి. ఈశ్వర కృష్ణ ఆస్తికుడు. అతడు రచించాడన్న దానినిబట్టి సాంఖ్యం యొక్క మూలసిద్ధాంతం ఎంతగా పలుచనై పోయి వుంటుందో ఎంతగా వక్రీకరించే అవకాశం వుందో ఊహించుకోవచ్చు. సాంఖ్య సూత్రాలు కూడా ఆ విధంగా రూపొందినవే.

ఈశ్వరవాదాన్ని చెండాడడంపై కేంద్రీకరించినంతగా సాంఖ్యం సమాజంలోని వర్గ వైరుధ్యాలపై దృష్టి సారించలేదు. లోకాయతానికి, సాంఖ్యానికి ఇదే ప్రధానమైన తేడా. అందుకు భావవాద తత్వవేత్తలు లోకాయతాన్ని శత్రుపూరిత దోరణితో నాశనం చేస్తే కపిలుడికి అమితమైన గౌరవం ఇచ్చారు. దేవుడి అవతారం అని అభివర్ణించారు. అదే సమ యంలో సాంఖ్యం యొక్క ఆయువు పట్టయిన స్వభావ వాదాన్ని నామమాత్రంగా మిగిల్చి వుంచారు.

తర్వాత కాలంలో వేదాలను ప్రమా ణంగా సాంఖ్యులు అంగీకరించడంతో దాని ప్రగతిశీలత కనుమరుగైంది. పశ్చిమదేశాలలో భౌతిక వాదులందరిలోకి ప్రాచీనుడు హిరాక్లిటస్‌. ఇతడు క్రీ.పూ. 550-480 సంవత్సరాల మధ్య జీవించిన గ్రీకుతత్వవేత్త. అంతకన్న దాదాపు 400-500 సంత్సరాలకు మనుపే మనదేశంలో సాంఖ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదీ దీని చారిత్రక ప్రాధాన్యత.


... control C and control V from
ఎం.వి.ఎస్‌. శర్మ's article

12, సెప్టెంబర్ 2009, శనివారం

EVM పై ఈసీఐల్ వారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

0 వ్యాఖ్యలు
నేను మరియ యింకొందరం కలసి మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఉన్న సందేహాలపై సుప్రీం కోర్టులో వేసిన ప్రజావాజ్యాన్ని మరియు మేము తయారు చేసిన ఈవియమ్ నకలు వలన ఈసీఐల్ వారి ప్రతిష్ఠదిగజారినదని మాకు ఈసీఐల్ వారు లీగల్ నోటీస్ జారీ చేసారు.

మాకు లీగల్ నోటీస్ జారీ చేయడమంటే, సుప్రీం కోర్టు మరియు ఎన్నికల సంఘం యొక్క విధులలో ఈసీఐల్ వారు తలదూర్చడమే అవుతుంది. ఎందుకంటే, మేము మెరుగైన ప్రజాస్వామ్యానికొఱకు సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎన్నికల సంఘం వారు ఎవరి యంత్రాలు వాడారు, యంత్రాలు తయారు చేసినవారి లాభనష్టాలతో మనకి సంబంధం ఏముంది? మాకు కావలసినది మాత్రం యంత్రాలను నమ్మవచ్చా? లేదా? ఏమైనా లొసుగులు వున్నాయా? వీటికి సమాధానము చెప్పవలసిన అవసరం కేవలం ఎన్నికల సంఘానిదే. దీనిలో ఈసీఐల్ వారికి సంబందం లేదు. ఎదుకంటే, ఎన్నికల సంఘం స్వతంత్ర్య నిర్ణయాత్మక సంస్థ. అంతేకాకుండా, ఎన్నికల నిర్వహణలో భారత రాజ్యాంగములోని పౌర చట్టము ప్రకారము ఎన్నికల సంస్థకు అన్ని హక్కులు కల్పంచబడ్డాయి. అంటే, ఈవీయమ్ లు, వాటి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పై ఎన్నికల సంఘానికి సంపూర్ణ హక్కులు కలిగి వుండాలి.

పై విషయాలను, కేంద్ర ఎన్నికల సంఘానికి మేము తెలియజేసితిమి. తదుపరి వెనువెంటనే, మాకు జారీచేసిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకోవలసినదిగా కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐల్ వారిని ఆదేశించినది . పూర్తి వివరాలు చదవండి...

మిరు టపాలు కూడా యిష్ట పడొచ్చు...
.ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (EVM) విషయంపై నాకు లీగల్ నోటీస్
౨. ఈసీఐఎల్ వారి లీగల్ నోటీసుకు సమాధానం..
౩. ఓటింగ్ యంత్రాల పై కేంద్ర ఎన్నికల సంఘం తో చర్చల సారాంశం