వీలుంటే నా నాలుగు లంకెలు ...

27, జూన్ 2009, శనివారం

పేద ప్రజలతో ప్రపంచ బ్యాంకు మరో లీల

0 వ్యాఖ్యలు
గ్రామీణులకు మినరల్‌ వాటర్‌ ఉచితమా? రొక్కమా? వెల్లడించని వైఎస్‌
గ్రామీణ ప్రజలకు బాటిళ్లలో మినరల్‌ వాటర్‌ను సరఫరా చేస్తామని శుక్రవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభ సందేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెప్పారు. ఆగస్టు 15 నుండి డ్వాక్రా సంఘాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామీణ ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నందున అందరికీ రక్షిత నీటిని అందించనున్నామన్నారు. మినరల్‌ వాటర్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారా లేక ఛార్జీలు వసూలు చేస్తారా అన్న విషయాన్ని సిఎం వెల్లడించలేదు. ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన జల ముసాయిదాలో తాగునీటిని సైతం విలువ ఆధారంగా చూడాలన్న నిబంధన ఉంది. ప్రపంచ బ్యాంక ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నీటి బొట్టునూ అమ్మాలన్న షరతును అమలు చేసే ఉద్దేశం మినరల్‌ వాటర్‌ సరఫరా వెనుక దాగుందని తెలుస్తోంది

25, జూన్ 2009, గురువారం

యజ్ఞం వర్షాన్ని కురిపిస్తుందా? మంత్రాలకు చింతకాయలు రాలతాయా?

0 వ్యాఖ్యలు
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం రాసిన మన వేదాల్లో వరుణదేవుడిని హోమంతో యజ్ఞం చేసి శాంతింపజేస్తే వర్షం కురుస్తుందని ఉంది. దీనికై హోమగుండంలో వేసిన నెయ్యి, కట్టెలు, ఇతర పూజాద్రవ్యాల వల్ల పొగ ఏర్పడి తద్వారా ధూళి కణాలు ఆకాశంవైపు పయనించి, మేఘం అడుగుభాగానికి చేరి వర్షింపజేస్తదని యజ్ఞం చేసేవారు నమ్ముతున్నారు. ఇప్పుడు అకాల పరిస్థితుల్లోనూ యజ్ఞం చేసి, వరుణదేవుడిని ప్రార్ధిస్తే వర్షాలు కురుస్తాయని వీరు నమ్ముతున్నారు. దీనికి ఆధారంగా ఇప్పటి మేఘమధనాన్ని చూపెడుతున్నారు. మేఘమధనం ద్వారా వెదజల్లిన లవణ కణాలలాగానే హోమధూళి మేఘాలను తాకుతుందని, ఈ కణాలు మేఘాలు వర్షించేలా చేస్తాయని వీరు చెపుతున్నారు. ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో ఇది సాధ్యమా అని ఆలోచించాలి.
అప్పట్లో అడవులు చాలా ఎక్కువగా ఉండేవి. మేఘాలు స్థిరంగా ఉండేవి. వాతావరణంలో కాలుష్యం సమస్యగా ఉండకపోయేది. ఆ పరిస్థితుల్లో ధూళి కణాలు ఏ కొద్దిగా మేఘాలని తాకినా మేఘాల్లోని తేమ నీరుగా మారి వర్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అడవులు విస్తారంగా నరికిన ఈ సమయంలో, వాహనాల కాలుష్యం పెరుగుతున్న ఈ నేపథ్యంలో గతంలోలాగా వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తు తక్కువ మేఘాలు ఉండటం లేదు. చాలా ఎత్తుగానే ఉంటున్నాయి. అటువంటప్పుడు ఈ హోమం ద్వారా వెలువడ్డ ధూళి కణాలు అసలు మేఘాల్ని చేరుకోగలవా అన్నది ప్రశ్న. వాహనాల ద్వారా వెలువడే కార్బన్‌ వాయువులు హోమం ధూళి కణాలకన్నా ఎక్కువగా విడుదలై మేఘాలను చేరి వర్షాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమం ద్వారా వెలువడ్డ కొద్దిపాటి ధూళి కణాలు ఇప్పటి వర్షాభావ పరిస్థితుల్లో కూడా మేఘాలకు చేరి, వర్షాన్ని కురిపించగలగటం దాదాపు అసాధ్యం. దీనిపై ప్రయోగపూర్వకంగా నిరూపితాలేమీ అందుబాటులో లేవు.

తమది దేవుడి పాలనని, వరణుడు తమ పార్టీలో చేరిపోయాడని చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు వరుణ యాగాలు చేయాలని పిలుపునిచ్చారు. పనిలో పనిగా చర్చిలు, మసీదుల్లో కూడా ప్రార్థనలు చేయాలన్నారు. ఆయా దేవాలయాలు, ధార్మిక సంస్థలు తమకు తామే అలా నిర్ణయించుకుంటే ఒక విధంగానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఆదేశాలు వెళ్లడం శాస్త్ర విజ్ఞానాన్ని, సెక్యులర్‌ రాజ్యాంగాన్ని అవమానించడం, అవహేళన చేయడమే అవుతుంది. కంటింజెన్సీ ప్రణాళికల గురించి ఆలోచించకుండా పంట యజ్ఞాలు చేయమని ఆజ్ఞాపించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇక వ్యవసాయ మంత్రి జులై 15 నుండి మేఘమథనం చేసి వర్షాలు కురిపిస్తామని చెప్తున్నారు. ఫలానా ప్రాంతంలో మేఘమథనం ద్వారా, ఫలానా సమయంలో వర్షం కురిసిందని రూఢిగా నిర్ధారించిన దాఖలా లేదు. ఇంతకీ వర్షాలు కురిస్తే యాగాల వల్ల కురిసినట్టా, ప్రార్థనలకు కరుణించినట్టా లేక మథనంతో జాలువారుతునట్టు భావించాలా? ఏది ఏమైనా ఇప్పుడు అన్నదాత సందిగ్థంలో ఉన్నాడు. సేద్యం సాధ్యం అవుతుందా? అని బెంబేలు పడుతున్నాడు. ఇంతకీ ఏరు వాక సాగేనా!?.

...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

24, జూన్ 2009, బుధవారం

ఉనికి చాటుకోవడానికే 'లాల్‌ఘర్‌'

0 వ్యాఖ్యలు
దేశంలో తమ ఉనికిని చాటుకునేందుకూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకూ పశ్చిమబెంగాల్‌లోని లాల్‌ఘర్‌ను మావోయిస్టులు విముక్తి ప్రాంతంగా ప్రకటించుకున్నారని తెలిసింది. విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని జాబితా తయారు చేసుకుని నాలుగేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. అందులో చివరన లాల్‌ఘర్‌ ఉంది. మూడు దశాబ్దాలకుపైగా పాలన సాగిస్తున్న వామపక్ష ప్రభుత్వంపై వివిధ రూపాల్లో సామ్రాజ్యవాద శక్తులు దాడి చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యమై బెంగాల్‌ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు తీవ్రమైన దుష్ప్రచారం చేస్తున్నాయి. మీడియాలోని ఒక భాగం దానికి తోడ్పడుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలను కాదని స్వంత పాలనను ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో మావోయిస్టులు సాగించారు. అదే సమయంలో కొందరి నుంచి డబ్బు వసూలు చేయడం, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం లాంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని తెలిసింది. ముఖ్యంగా గిరిజనులను రెచ్చగొట్టడం, శిక్షణ ఇవ్వడం ద్వారా వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని సమాయత్తం చేసే ప్రయత్నం పథకం ప్రకారం సాగింది. సాయుధ శిక్షణ, గెరిల్లా పోరాటం ఎలా నిర్వహించాలి? విధ్వంస చర్యలను ఏ సమయంలో ఎలా సృష్టించాలన్న దానిపై జార్ఖండ్‌ మావోయిస్టులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. మావోయిస్టు పొలిట్‌బ్యూర్‌ సభ్యులు నంబాళ్ల కేశవరావు ఎలియాస్‌ గంగన్న పర్యవేక్షణలో అంతా జరిగిందని తెలిసింది. లాల్‌ఘర్‌ పోరుకు నంబాళ్ల కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. విముక్త ప్రాంతంగా ప్రకటించుకోడానికి ముందు కేశవరావు జార్ఖండ్‌ చేరుకున్నారని, అక్కడి నుంచే లాల్‌ఘర్‌ అపరేషన్‌ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. సాయుధ బలగాలను నిరోధించేందుకు ఏ వంతెనలు కూల్చాలి, రోడ్లెక్కడ దెబ్బతీయాలి, చెట్లను ఎక్కడ కూల్చాలి, ఎలా నిరోధించాలి అన్న దానిపై మావోయిస్టులు ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మందుపాతరలను చాలా ముందుగానే వాటిని అమర్చి ఉంచారని తెలిసింది.
మీడియాపైనా దృష్టి
తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు మీడియాను వాడుకోవాలని మావోయిస్టులు తాజాగా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ ప్రహ్లాద్‌ను తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా లాల్‌ఘర్‌ విషయంలో వరుసగా మూడు రోజులు మీడియాకు కోటేశ్వరరావు సమాచారమందిస్తూ తమ వైఖరిని వెల్లడించారు. ఆయన లాల్‌ఘర్‌ ప్రాంతం నుంచే ప్రకటనలు చేస్తున్నారని మీడియా, పోలీసు వర్గాలు తొలుత భావించాయి. వాస్తవంగా కోటేశ్వరరావు జార్ఖండ్‌ నుంచే మాట్లాడారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోటేశ్వరరావు నాయకత్వంలోనే లాల్‌ఘర్‌ విధ్వంసం మొదలైందని అందరూ భావించినప్పటికీ దాని వ్యూహకర్త నంబాళ్ల కేశవరావేనని రూఢిగా తెలిసింది.
జార్ఖండ్‌లోనే కేశవరావు, కోటేశ్వరరావు?
కేశవరావు, కోటేశ్వరరావులిద్దరూ జార్ఖండ్‌లోని షెల్టర్‌ జోన్‌లో ఉన్నారని, మిగిలిన ఆంధ్ర నాయకత్వమంతా చత్తీస్‌ఘడ్‌లోనే ఉన్నారని భోగట్టా. లాల్‌ఘర్‌తోపాటు మరో ఆరు విముక్తి ప్రాంతాలను మావోయిస్టులు మున్ముందు ప్రకటించనున్నారని తెలిసింది. చత్తీస్‌ఘడ్‌లోని దంతె వాడతోపాటు మరో ప్రాంతం, ఒరిస్సాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌, జార్ఖండ్‌లో ఒక ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోని అరకు, పాడేరు ఏజెన్సీలను కూడా విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని లక్ష్యంగా రిక్రూట్‌మెంట్‌ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం పెద్దయెత్తున ఆయుధాలు,కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారమందింది. విముక్తి పోరాటం పేరిట గిరిజనులను సాయుధులుగా చేయాలన్న ఆలోచనలో మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించు కున్నారని, సంస్కరణలు, ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిరుద్యోగం పెరిగే ఈ కాలంలో విముక్తి ప్రాంతాల పోరు సాగించడం ద్వారా నిరుద్యోగ యువతను పార్టీవైపు ఆకర్షించొచ్చని అభిప్రాయపడుతున్నారు.
నేపాల్‌ అనుభవాలతో విముక్తి పోరాటం
నేపాల్‌ అనుభవాలే విముక్తి పోరాటంవైపు ఉసిగొల్పాయని మావోయిస్టులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంవైపు రావాలని ప్రచండ ఇచ్చిన పిలుపును మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పిలుపును తిప్పికొట్టేందుకే లాల్‌ఘర్‌ను ఆయుధంగా ఎంచుకున్నారని తెలిసింది. ప్రజాస్వామ్య దేశంలో వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో సాయుధ పోరాటం చేపట్టడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తమ సిద్ధాంతాలను వ్యతిరేస్తున్న వామపక్ష శక్తులను బలహీనపర్చాలన్న లక్ష్యంతోనే మావోయిస్టులు పనిచేస్తున్నారు. నేపాల్‌తో ముగిసిపోలేదనీ, తాము భారతదేశంలో ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశం మావోయిస్టుల్లో ఉంది. విముక్తి ప్రాంతం ప్రకటించక ముందే లాల్‌ఘర్‌కు అధునాతన ఆయుధాలనూ, రాకెట్‌ లాంచర్లనూ చేరవేశారు. ప్రభుత్వంతో దీర్ఘకాల యుద్ధం చేయలేమని మావోయిస్టులు ముందుగానే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వాటి అనుభవాలను తీసుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనలో వారున్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలను సాధ్యమైనంత ఎక్కువ నష్టపరచాలన్న లక్ష్యంతో మావోయిస్టులు లాల్‌ఘర్‌ పరిసరాల్లో భారీ విధ్వంసక చర్యలకు పూనుకునే అవకాశముందని తెలిసింది.
...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో

తృణమూల్‌, మావోయిస్టుల భయానక రాజకీయాలు

4 వ్యాఖ్యలు
ఉగ్రవాదాన్ని విస్తరింపచేయటం ద్వారా భయానక రాజకీయాలకు పాల్పడుతున్న తృణమూల్‌, మావోయిస్టు కూటమి మిడ్నపూర్‌, బంకురా తదితర జిల్లాల్లో రోడ్లు తవ్వుతూ, చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేస్తూ అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవటమే కాక ఈ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నాయి. తృణమూల్‌నేత ఛత్రధర్‌ మహతో నేతృత్వంలోని కంగారూ కమిటీ ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతుండటాన్ని గమనిస్తున్న ఇక్కడి ప్రజలు వారి ప్రచారంలోని డొల్లతనాన్ని కూడా గమనిస్తున్నారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ, మావోయిస్టు నేత కిషన్‌జీ గత 32 ఏళ్లుగా కమ్యూనిస్టు ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఈ పరిస్థితికి దారి తీశాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియకు విఘాతం కలిగింది గత కొన్నేళ్లుగా మాత్రమే, అదికూడా ఈ ప్రాంతంలో మావోయిస్టు, తృణమూల్‌ కూటమి అరాచకానికి పాల్పడినందువల్లే అభివృద్ధి స్థంభించిపోయింది. ఈ విషయాన్ని స్పష్టం చేసిన బెంగాల్‌ పశ్చిమ ప్రాంత అభివృద్ధి సుశాంతఘోష్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచని గ్రామాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. బిన్‌పూర్‌1, 2 బ్లాకలేలో అధికశాతం పంచాయితీలు జార్ఖండి పార్టీ పాలనలో వున్నాయి. ఈ ప్రాంతాలలో అభివృద్ధికి నోచని ప్రాంతాలను ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో సమన్వయం చేసుకోలేని లోపం ఆ పార్టీదేనని మంత్రి వివరించారు. తాను స్వయంగా ఈ గ్రామాలకు వెళ్లి ప్రత్యేక పథకాలను మంజూరు చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాల కింద ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీటి సరఫరా, ఆదాయ పెంపుదల, ఉపాధికల్పనతోపాటు పాఠశాలభవనం, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం వంటివి చేపట్టారన్నారు. ఈ పథకాలు తొలి ఏడాది నుండే ప్రయోజనాలు అందించాయని, గత ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడినా సురక్షిత తాగునీటిని ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేశామని ఆయన వివరించారు. లాల్‌ఘర్‌, దాని పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులకు నేతృత్వం వహిస్తున్న ఛత్రధర్‌ మహతో గత వారం ఈ ప్రాంతాల్లో మీడియాలోని ఒక వర్గం ప్రతినిధులతో పర్యటించి గత 32 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చేసిందేమీ లేదంటూ విషం కక్కారు. రోడ్డుకు అడ్డంగా మావోయిస్టులు తవ్విన కాలువ ఈ ప్రాంతానికి తాగునీటిని సరఫరా చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ వారి సమాధులను వారే తవ్వుకున్నారని నిరసన వ్యక్తంచేస్తూ గిరిజన గ్రామీణులు వేరు ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే వీరిని అడ్డుకుంటున్న మావోయిస్టులు తాము కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెబుతున్నారు. తాము కూడా ఇక్కడ ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తున్నామని వారు చెప్పినప్పటికీ అక్కడెక్కడా వైద్యులు కానీ, ఔషధాలు కానీ కన్పించిన దాఖలాలు లేవు. ఇంతకు ముందే చెప్పినట్టు మావోయిస్టులు మందుపాతర పేల్చి ఒక వైద్యుడిని, నర్స్‌ను హతమార్చటంతో ఈ ప్రాంతాలకు వచ్చి సేవలందించాలంటేనే వారు హడలెత్తిపోతున్నారు.
పర్యాటకానికి గండి కొట్టిన మావోయిస్టులు
ప్రకృతిరమణీయత ఉట్టిపడుతూ గతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ఈ ప్రాంతానికి ఇప్పుడు మావోయిస్టుల దుశ్చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయి. పర్యాటక కేంద్రాలను పేల్చివేసిన మావోయి స్టులు ఈ ప్రాంతంలో పర్యాటకానికి కూడా గండికొట్టారు. అసలు ఈ ప్రాంతానికి మిగిలిన ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసేందుకు వారు రోడ్డు ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ బెడదతను తట్టుకోలేని కంపెనీలు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి పోయాయి. అంతేకాదు మావోయిస్టులు ఇక్కడ ఒక వ్యూ హం ప్రకారం ఒకదాని వెంట ఒకటిగా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ధ్వంసం చేశారు. ముఖ్యంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఆర్దిక వనరులు సంపాదించు కునేందుకు భారీమొత్తంలో చెట్లను తెగనరికి టింబర్‌ మాఫియాకు తెగనమ్మేశారు.
ఈ విధంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలకు సామాన్యులనే కాక పర్యావరణాన్ని కూడా బలిపెట్టారు. మావోయిస్టుల దాడుల కారణంగా ఈ ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. బెంగాల్‌ పశ్చిమ ప్రాంతం, సుందర్‌బన్స్‌, ఉత్తర బెంగాల్‌ల అభివృద్ధికి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌ కేటాయింపులను 190 కోట్ల నుండి 285 కోట్ల రూపాయలకు పెంచింది. లాల్‌ఘర్‌ ప్రాంత గిరిజనులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందచేసేందుకు ఈ ప్రాంతంలోని వైద్య కేంద్రాలన్నింటి స్థాయిని పెంచింది. ఈ ప్రాంతంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉమ్మడిగా దుష్ప్రచారం చేసినా గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి లెఫ్ట్‌ఫ్రంట్‌ తరపున పోటీ చేసిన సిపిఎం అభ్యర్ధి పులిన్‌ బిహారీ బాస్కీకి దాదాపు 65 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.