24, జూన్ 2009, బుధవారం
ఉనికి చాటుకోవడానికే 'లాల్ఘర్'
మీడియాపైనా దృష్టి
తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు మీడియాను వాడుకోవాలని మావోయిస్టులు తాజాగా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే మావోయిస్టు పొలిట్బ్యూరో సభ్యులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ ప్రహ్లాద్ను తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా లాల్ఘర్ విషయంలో వరుసగా మూడు రోజులు మీడియాకు కోటేశ్వరరావు సమాచారమందిస్తూ తమ వైఖరిని వెల్లడించారు. ఆయన లాల్ఘర్ ప్రాంతం నుంచే ప్రకటనలు చేస్తున్నారని మీడియా, పోలీసు వర్గాలు తొలుత భావించాయి. వాస్తవంగా కోటేశ్వరరావు జార్ఖండ్ నుంచే మాట్లాడారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కోటేశ్వరరావు నాయకత్వంలోనే లాల్ఘర్ విధ్వంసం మొదలైందని అందరూ భావించినప్పటికీ దాని వ్యూహకర్త నంబాళ్ల కేశవరావేనని రూఢిగా తెలిసింది.
జార్ఖండ్లోనే కేశవరావు, కోటేశ్వరరావు?
కేశవరావు, కోటేశ్వరరావులిద్దరూ జార్ఖండ్లోని షెల్టర్ జోన్లో ఉన్నారని, మిగిలిన ఆంధ్ర నాయకత్వమంతా చత్తీస్ఘడ్లోనే ఉన్నారని భోగట్టా. లాల్ఘర్తోపాటు మరో ఆరు విముక్తి ప్రాంతాలను మావోయిస్టులు మున్ముందు ప్రకటించనున్నారని తెలిసింది. చత్తీస్ఘడ్లోని దంతె వాడతోపాటు మరో ప్రాంతం, ఒరిస్సాలోని మల్కన్గిరి, కోరాపుట్, జార్ఖండ్లో ఒక ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. మన రాష్ట్రంలోని అరకు, పాడేరు ఏజెన్సీలను కూడా విముక్తి ప్రాంతాలుగా ప్రకటించాలని లక్ష్యంగా రిక్రూట్మెంట్ కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం పెద్దయెత్తున ఆయుధాలు,కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకున్నట్లు సమాచారమందింది. విముక్తి పోరాటం పేరిట గిరిజనులను సాయుధులుగా చేయాలన్న ఆలోచనలో మావోయిస్టులు ప్రణాళికలు రూపొందించు కున్నారని, సంస్కరణలు, ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిరుద్యోగం పెరిగే ఈ కాలంలో విముక్తి ప్రాంతాల పోరు సాగించడం ద్వారా నిరుద్యోగ యువతను పార్టీవైపు ఆకర్షించొచ్చని అభిప్రాయపడుతున్నారు.
నేపాల్ అనుభవాలతో విముక్తి పోరాటం
నేపాల్ అనుభవాలే విముక్తి పోరాటంవైపు ఉసిగొల్పాయని మావోయిస్టులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంవైపు రావాలని ప్రచండ ఇచ్చిన పిలుపును మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పిలుపును తిప్పికొట్టేందుకే లాల్ఘర్ను ఆయుధంగా ఎంచుకున్నారని తెలిసింది. ప్రజాస్వామ్య దేశంలో వామపక్ష ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో సాయుధ పోరాటం చేపట్టడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తమ సిద్ధాంతాలను వ్యతిరేస్తున్న వామపక్ష శక్తులను బలహీనపర్చాలన్న లక్ష్యంతోనే మావోయిస్టులు పనిచేస్తున్నారు. నేపాల్తో ముగిసిపోలేదనీ, తాము భారతదేశంలో ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్న ఉద్దేశం మావోయిస్టుల్లో ఉంది. విముక్తి ప్రాంతం ప్రకటించక ముందే లాల్ఘర్కు అధునాతన ఆయుధాలనూ, రాకెట్ లాంచర్లనూ చేరవేశారు. ప్రభుత్వంతో దీర్ఘకాల యుద్ధం చేయలేమని మావోయిస్టులు ముందుగానే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వాటి అనుభవాలను తీసుకోవడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనలో వారున్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలను సాధ్యమైనంత ఎక్కువ నష్టపరచాలన్న లక్ష్యంతో మావోయిస్టులు లాల్ఘర్ పరిసరాల్లో భారీ విధ్వంసక చర్యలకు పూనుకునే అవకాశముందని తెలిసింది.
...ఒక తెలుగు దిన పత్రిక సౌజన్యంతో
తృణమూల్, మావోయిస్టుల భయానక రాజకీయాలు
పర్యాటకానికి గండి కొట్టిన మావోయిస్టులు
ప్రకృతిరమణీయత ఉట్టిపడుతూ గతంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ఈ ప్రాంతానికి ఇప్పుడు మావోయిస్టుల దుశ్చర్యలు గొడ్డలిపెట్టుగా మారాయి. పర్యాటక కేంద్రాలను పేల్చివేసిన మావోయి స్టులు ఈ ప్రాంతంలో పర్యాటకానికి కూడా గండికొట్టారు. అసలు ఈ ప్రాంతానికి మిగిలిన ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసేందుకు వారు రోడ్డు ప్రాజెక్టులను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. నిరంతరంగా కొనసాగుతున్న ఈ బెడదతను తట్టుకోలేని కంపెనీలు తమ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లి పోయాయి. అంతేకాదు మావోయిస్టులు ఇక్కడ ఒక వ్యూ హం ప్రకారం ఒకదాని వెంట ఒకటిగా కీలకమైన మౌలిక వసతులన్నింటినీ ధ్వంసం చేశారు. ముఖ్యంగా తమ కార్యకలాపాలకు అవసరమైన ఆర్దిక వనరులు సంపాదించు కునేందుకు భారీమొత్తంలో చెట్లను తెగనరికి టింబర్ మాఫియాకు తెగనమ్మేశారు.
ఈ విధంగా మావోయిస్టులు తమ కార్యకలాపాలకు సామాన్యులనే కాక పర్యావరణాన్ని కూడా బలిపెట్టారు. మావోయిస్టుల దాడుల కారణంగా ఈ ప్రాంతంలో దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. బెంగాల్ పశ్చిమ ప్రాంతం, సుందర్బన్స్, ఉత్తర బెంగాల్ల అభివృద్ధికి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులను 190 కోట్ల నుండి 285 కోట్ల రూపాయలకు పెంచింది. లాల్ఘర్ ప్రాంత గిరిజనులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందచేసేందుకు ఈ ప్రాంతంలోని వైద్య కేంద్రాలన్నింటి స్థాయిని పెంచింది. ఈ ప్రాంతంలో లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు, తృణమూల్ కాంగ్రెస్ ఉమ్మడిగా దుష్ప్రచారం చేసినా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి లెఫ్ట్ఫ్రంట్ తరపున పోటీ చేసిన సిపిఎం అభ్యర్ధి పులిన్ బిహారీ బాస్కీకి దాదాపు 65 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి.
ప్రాణస్నేహితులు
Please click on Play button to listen my favorite song
మావోయిస్టు నిషేధం పరిష్కారం కాదు
నక్సల్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూడాలి. రాష్ట్రంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలను 1978 ప్రాంతంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్బంధం అమలు చేశారు. 1980లో పీపుల్స్వార్ ఏర్పాటయ్యాక దాని కార్యకలాపాలు ఉధృతమయ్యాయి. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం 'వార్'పై నిర్బంధాన్ని తీవ్రతరం చేసింది. 1989లో మర్రి చెన్నారెడ్డి సర్కారు నిర్భందాన్ని సడలించగా 1992లో తొలిసారి నేదురుమల్లి నిషేధం విధించారు. 1995లో ఎన్టీఆర్ సడలించగా 1996లో చంద్రబాబు మళ్లీ నిషేధం విధించారు. 2004లో వైఎస్ బ్యాన్ను సడలించి నక్సల్ నేతలతో నేరుగా చర్చలు జరిపారు. 2005లో మళ్లీ నిషేధం విధించారు. అందరికంటే ముందుగా బీహార్లో 1986లో ఎంసిసిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. సాంకేతికంగా మావోయిస్టుపార్టీ పేరు నిషిద్ధ సంస్థల జాబితాలో లేకపోయినా దానిలో విలీనమైన రెండు గ్రూపులనూ కేంద్రం ఎప్పుడో నిషేధించింది. దేశంలో, రాష్ట్రాల్లో బ్యాన్ ఉన్నప్పటికీ హింసాత్మక చర్యలు, ఎన్కౌంటర్లు తాత్కాలికంగా మినహా పూర్తిస్థాయిలో అదుపు చేయడం సాధ్యం కాదని తేటతెల్లమైనా ఇప్పుడు కొత్తగా కేంద్రం బ్యాన్ విధించడం దేనికి? రాజకీయ ప్రయోజనాలను ఆశించే సరిగ్గా బెంగాల్లో లాల్ఘర్ ఉదంతం ముందుకొచ్చిన సమయంలో నిషేధం విధించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హింస పెచ్చరిల్లినప్పుడు స్పందించకుండా లెఫ్ట్ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బెంగాల్లో కొన్ని ఘటనలు చూపి బ్యాన్ పెట్టింది. ఆ రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తోంది. బెంగాల్లో లెఫ్ట్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి, ఇబ్బందులు సృష్టించడానికి ఇప్పటి వరకూ మావోయిస్టుల హింసకు మద్దతు పలికిన తృణమూల్ కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామి. లాల్ఘర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ప్రముఖులెవ్వరూ సందర్శించవద్దని కేంద్ర హోంమంత్రి ప్రకటించినా తృణమూల్ కి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని మరింత క్షీణింపజేశారు. వీరంతా ఒకే కేబినెట్లో సభ్యులు. వారి ఉమ్మడి బాధ్యత ఎలా ఉందో ఈ చర్య విదితమవుతోంది.
మావోయిస్టుపార్టీపై నిషేధం విధించాలని గత యుపిఎ ప్రభుత్వం ఆలోచన చేసింది. లెఫ్ట్ మద్దతుపై సర్కారు మనుగడ సాగిస్తుండటంతో అప్పుడు ఆ సాహసం చేయలేకపోయింది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకపోవడంతో బ్యాన్ పెట్టింది. నిషేధం వల్ల నక్సల్ సమస్యను పరిష్కరించలేమని వామపక్షాలు అందులోనూ సిపిఎం చెబుతూ వచ్చింది. అందుకే కేంద్ర హోంమంత్రి చిదంబరం నిషేధించాలని సూచించినా బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ అంగీకరించలేదు. కేంద్రం బ్యాన్ పెట్టగానే వామపక్షాలు వ్యతిరేకించాయి. నిషేధం దేశం మొత్తానికీ వర్తిస్తున్నందున బెంగాల్లో తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలపై చర్చిస్తున్నామని లెఫ్ట్ సర్కారు పేర్కొంది. నిషేధంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదని, మావోయిస్టులను ప్రజల నుండి వేరు చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్కరత్ చెప్పారు. నిరంతర రాజకీయపోరాటం తప్ప సమస్యకు బ్యాన్ పరిష్కారంకాదని బెంగాల్ లెఫ్ట్ఫ్రంట్ స్పష్టం చేసింది. నిషేధాన్ని కాంగ్రెస్, బిజెపి స్వాగతించడం, వామపక్షాలు వ్యతిరేకించడం ఇందుకే. పై పూతలు, తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా సామాజిక, ఆర్థిక సమస్యలను తగ్గించే రాజకీయ పరిష్కారమే అసలైన మందు.